రైల్లో కేజీ గోల్డ్ చోరీ: దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు
హైదరాబాద్: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చిన దురంతో ఎక్స్ప్రెస్ రైల్లో బంగారం చోరీ జరిగింది. ఓ మహిళకు చెందిన బ్యాగ్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆ బ్యాగులో కిలో బంగారం ఉన్నట్లు మహిళ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్థరాత్రి దాటిన తర్వాత ఈ చోరీ జరిగినట్లు సమాచారం.
దురంతో ఎక్స్ప్రెస్ రైల్లోని ఎసి బోగీలో ప్రయాణించిన మహిళకు సికింద్రాబాదులో దిగిన తర్వాత చూసుకునే సరికి బ్యాగ్ కనిపించలేదు. ఎసి బోగీలోకి అర్థరాత్రి దాటిన తర్వాత ఎవరో ప్రవేశించి ఆ బ్యాగ్ను ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు సిసిటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
రైళ్లలో చోరీలు గతంలో కూడా జరిగినప్పటికీ ఎసీ బోగీల్లో అటువంటి సంఘటనలు జరగడం అరుదు. నిజానికి ఎసీ బోగీలు లాక్ చేసి ఉంటాయి. లాక్ చేసి ఉన్న ఎసిబోగీలోకి దొంగ ఎలా ప్రవేశించడానేది తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగరర్ జిల్లాలో దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాదు నుంచి తిరుపతి వెళ్తున్న ఆ బస్సు నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా పెద్దమందదడి వెల్టూరు గ్రామం వద్ద గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఒక్కసారిగా బస్సు ఇంజన్లోంచి పొగలు రావడంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు కిందకు దిగిపోయారు. ప్రయాణికులు 29 మంది సురక్షితంగానే ఉన్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు దాదాపు 3 గంటల పాటు రోడ్డు మీదే ఉండిపోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications