టిక్కెట్లు మీకే, ప్రచారం చేసుకోండి: ఫోన్ చేసి కేసీఆర్ హామీ, వారిపై తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోసం తాను ప్రకటించిన అభ్యర్థులను మార్చేది లేదని తెరాస అధ్యక్షులు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అందరికీ హామీ ఇచ్చారని తెలుస్తోంది. అసమ్మతి గురించి ఎలాంటి భయం వద్దని, దానిని పరిష్కరిస్తామని చెప్పారని తెలుస్తోంది. 105 మంది అభ్యర్థులను ప్రకటించడం, కొందరిని పెండింగులో పెట్టడంతో అసంతృప్తులు బయటకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో టిక్కెట్ పొందిన వారు ధైర్యంగా ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన వారికి మరోసారి హామీ ఇచ్చారని తెలుస్తోంది. మీ మీ నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరగాలని, ప్రజలను కలవాలని సూచించారు. బి ఫాం గురించి ఎలాంటి అనుమానాలు వద్దని, నిశ్చింతగా ప్రచారం చేసుకోవాలన్నారు.
ప్రతి పాత జిల్లాకు ముగ్గురేసి చొప్పున మొత్తం ముప్పై మంది అభ్యర్థులకు కేసీఆర్ బుధవారం ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. ప్రచారం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా టిక్కెట్ అనుమానాలు లేవనెత్తగా ధైర్యం చెప్పారట. తాను అన్ని ఆలోచించి టిక్కెట్ ఇచ్చానని చెప్పారట. ఎన్నికలు త్వరలో జరుగుతాయని, తేదీల గురించి చూడకుండా, ప్రచారం చేసుకోవాలన్నారు.
కొందరు అభ్యర్థులు హైదరాబాదులోనే ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇంకా హైదరాబాదులో ఉండటం ఏమిటని, రేపటి నుంచి వెంటనే ప్రచారం చేయాలని సూచించారు.