కొట్టుకున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు: స్మృతిపై చర్యలు: విహెచ్
హైదరాబాద్/నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఫ్లెక్సీ వివాదం శనివారం నాడు ఘర్షణకు దారి తీసింది. ఐకేపీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే ఫ్లెక్సీలో అధికార పార్టీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఫోటో లేదు. దీంతో భూపతి రెడ్డి అనుచరుడు వెంకట్.. ఫోటో విషయమై బాజిరెడ్డిని నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో ఉన్నట్టుండి వెంకట్ పైన ఎమ్మెల్యే బాజిరెడ్డి చేయిచేసుకున్నారు.
దాంతో ఆగ్రహించిన భూపతి రెడ్డి బాజిరెడ్డి పైకి వెళ్లారు. ఇదే సమయంలో ఇద్దరి అనుచరులు, పార్టీ కార్యకర్తలు కూడా పరస్పరం దాడి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఘర్షణలో వెంకట్కు రక్తంస్రావం అయిందని సమాచారం. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని అడ్డుకుని శాంతింప చేశారు. భూపతి రెడ్డి సభ నుంచి వెళ్లిపోయారు.
స్మృతి పైన చర్యలు తీసుకోవాలి: విహెచ్
వేముల రోహిత్ కులంపై రాద్దాంతం చేయడం సరికాదని, రోహిత్ కులంపై విచారణ జరిపిన పోలీసులు, రోహిత్ ఆత్మహత్యపై ఎందుకు విచారణ చేయలేదని కాంగ్రెస్ నేత వి హనుమంత రావు ప్రశ్నించారు. హెచ్సియు వీసీ అప్పారావు పైన ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో అబద్దాలు ఆడారని, ఆమెపై చర్యలు తీసుకోవాలన్నారు.