చంద్రబాబు స్వయంప్రకాశం లేని నేత,సింహం సింగిలే, నాకు అసంతృప్తి:కెటిఆర్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోన్న తమ ప్రభుత్వం...నాలుగో ఏడాది పూర్తిస్థాయిలో ఫలితాలను సాధిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు.
హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోన్న తమ ప్రభుత్వం...నాలుగో ఏడాది పూర్తిస్థాయిలో ఫలితాలను సాధిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. ప్రజల తీర్పే కొలమానమన్నారు.అయితే వందశాతం ప్రజలను ఏ ప్రభుత్వం సంతృప్తిపర్చలేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడమే కాదు, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్ళు పూర్తైన సందర్భంగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకుగాను ఇతర పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన తేలిగ్గా తీసుకొన్నారు. అమిత్ షా, రాహుల్ గాంధీలు వచ్చినా టిఆర్ఎస్ ను ఏం చేయలేరని ఆయన చెప్పారు.
తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని చెప్పారు. అవినీతి విషయంలో రాజీపడబోమని చెప్పారు కెటిఆర్. వివక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పాటుకావడమంటెనే ఆయా పార్టీల బలమెమిటో అర్ధం చేసుకోవచ్చన్నారు కెటిఆర్.
అందరినీ సంతృప్తిపర్చడం సాధ్యం కాదు
వందకు వందశాతం ప్రజలను సంతృప్తిపర్చడం సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు.ఈ విషయంలో భగవంతుడికి కూడ సాధ్యం కాదనే విషయాన్ని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ సందర్భాన్ని బట్టి ప్రభుత్వం వ్యవహరిస్తోన్నదాన్ని బట్టి ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసాన్ని ఏర్పాటుచేసుకొంటారు. మూడేళ్ళలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో తీసుకెళ్తోన్న ఘనత తమదేనని చెప్పారు కెటిఆర్.
టిఆర్ఎస్ ను ఏం చేయలేరు
తమ ప్రభుత్వం పనితీరును బేరీజు వేసుకొనేందుకు సర్వేలు నిర్వహిస్తున్నాం. మూడు దఫాల పాటు ముఖ్యమంత్రి సర్వేలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధుల పనితీరును మెరుగుపర్చుకొనేందుకు ఈ సర్వేలు. అనుకోకుండానే అధికారంలోకి వచ్చాం. ప్రతిపక్షాలకు మేం భయపడం. అమిత్ షా వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా తాము భయపడబోమన్నారు. క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలమెంత అనే విషయాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. అంతేకాదు విపక్షాలన్నీ కూటమిగా ఏర్పాటై పోటీచేయాలనుకోవడం ఆ పార్టీల బలహీనతను బయటపెడుతోందన్నారు కెటిఆర్.సింహం సింగిల్ గా వస్తోంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన టిడిపి అదే పార్టీతో పెట్టుకోవాలనే ఆలోచన చేయడం ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోందని చెప్పారు.
చంద్రబాబు స్వయం ప్రకాశం లేని నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయం ప్రకాశం లేని నేత అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. 1999లో కూడ ఆయన స్వంతగా గెలవలేదన్నారు. రానున్న ఎన్నికల్లో కూడ ఆయన గెలిచే పరిస్థితి లేదన్నారు.ఏదో ఒక పార్టీ పొత్తు కారణంగానే ఆయన గెలిచిన చరిత్ర ఉందన్నారు కెటిఆర్. గత చరిత్ర అంతా అదేనని చెప్పారు.
కెసిఆర్ పై బురదచల్లే ప్రయత్నం
ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇబ్బందులు లేని సమస్యలను ఆయన పెద్ద సమస్యలుగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే కొందరు మేధావులు పనిగా పెట్టుకొన్నారని ఆయన పరోక్షంగా టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ విమర్శలు గుప్పించారు. ప్రజా సంఘాల పేరుతో కెసిఆర్ పై బురదచల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఎక్కడ టెంట్ వేస్తే అక్కడ కోదండరామ్ వాలిపోతున్నాడని ఆయన ఏకేశాడు.జాతీయ పార్టీలు లేవన్నారు. అవన్నీ పెద్ద సైజ్ ప్రాంతీయ పార్టీలేనని చెప్పారు.
నాకు అసంతృప్తి
జిహెచ్ ఎంసీ లో పనులు వేగంగా జరగడం లేదని వ్యక్తిగతంగా తనకు అసంతృప్తి ఉందని కెటిఆర్ అన్నారు. హైద్రాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్టు చెప్పారు. కార్పోరేటర్ల పనితీరుపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని అయితే వాటిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకొంటామని మంత్రి చెప్పారు. ప్రజల్లో అసహనం లేదన్నారు. వచ్చే రెండేళ్ళలో రెండున్నర లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించనున్నట్టు చెప్పారాయన.