తెలంగాణలో తొలిసారి జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: 1392 పోస్టులు, అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తాజాగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి జనవరి 6 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. జూన్ లేదా జులైలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడకపోవడం గమనార్హం. దీంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నోటిఫికేషన్ జారీ చేశారు. అనేక అవాంతరాల తర్వాత ఈ పోస్టులను 2012లో భర్తీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 457 జేఎల్ పోస్టులను అప్పట్లో భర్తీ చేయగలిగారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్ పోస్టుల భర్తీ ఇప్పటి వరకు జరగలేదు. తాజాగా, శుక్రవారం జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 18 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని కోసం ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 16 నుంచి స్వీకరించనున్నారు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 15, 2023గా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులు టీఎస్ పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ప్రొఫార్మా అప్లికేషన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు.
ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.