నారాయణపై వెలాసిటీ పోరులో ట్వీస్ట్: లెక్చరర్ స్పందన
హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థలకు, వెలాసిటి విద్యాసంస్థలకు మధ్య జరుగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. నారాయణ విద్యాసంస్థలపై లెక్చరర్ను కిడ్నాప్ చేశారంటూ వెలాసిటీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గత వారం రోజుల పాటు అదృశ్యమైన వెలాసిటీ కార్పొరేట్ జూనియర్ కాలేజీ సీనియర్ లెక్చరర్ అశ్వత్థరావు గురువారం విజయవాడలో తేలారు.
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, సొంత పనుల మీద తాను విజయవాడ వచ్చానని చెప్పారు. నారాయణ సంస్థలు తనను బంధించాయనే వార్తల్లో నిజం లేదని స్పష్ట చేశారు. ఓ ప్రముఖ దినపత్రిక ఆంధ్రభూమితో ఆయన మాట్లాడారు.. ఇప్పటికీ తాను వెలాసిటీలోనే పనిచేస్తున్నానని, ఆ యాజమాన్యం తనపై ఎందుకింత దుష్ప్రచారం చేస్తోందో అర్ధం కావడం లేదని చెప్పారు.
ఫోన్లో అందుబాటులో ఉన్న అశ్వత్థరావు బయటకు మాత్రం రాలేదు. తాను ఎక్కడున్నారో కూడా చెప్పలేదు.
తాను సెలవుపై వెళ్తున్నట్టు వెలాసిటీ డైరెక్టర్ వంశీకృష్ణకు చెప్పానని, అవసరమైతే ఈ నెల వేతనాన్ని తగ్గించుకోవచ్చని కూడా సమాచారం ఇచ్చినట్టు అశ్వత్థరావు టెలిఫోన్లో చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. 15 ఏళ్లు తాను నారాయణ విద్యాసంస్థల్లో పనిచేశానని, ఎన్నడూ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోలేదని చెప్పారు.
నారాయణలో పనిచేస్తున్నపుడు తనను బలవంతంగా వెలాసిటీ సిబ్బంది తీసుకువెళ్లారని, వెళ్తూ వెళ్తూ కూడా తాను నారాయణ విద్యాసంస్థల యాజమాన్యానికి కూడా సమాచారం ఇచ్చానని అన్నారు. గతంలో తన వేతనం ఏటా పది లక్షలు మాత్రమేనని, ఇపుడు కొద్దిగా పెరిగిందే తప్ప 1.80 కోట్ల రూపాయాలు అనేది ప్రచారం మాత్రమేనని అన్నారు.
తన ఆదాయానికి ఎప్పటికపుడు పన్ను చెల్లిస్తున్నానని ఆ ఇబ్బంది తనకు లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వెళ్లగానే సోమవారం పోలీసుల ముందు హాజరై వివరణ ఇస్తానని చెప్పారు. తనను తీసేయడం కోసమే ఇలాంటి చెత్త ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

నోటీసులు అతికించిన పోలీసులు...
వెలాసిటీలో పనిచేస్తూ అదృశ్యమైన అశ్వత్థరావుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అశ్వత్థరావు ఇంట్లో లేకపోవడంతో ఆయన నివాసం వద్ద నోటీసులు అతికించారు, అదే విధంగా అశ్వత్థరావు అదృశ్యం కేసులో నారాయణ విద్యాసంస్థలకు సైతం సైబరాబాద్ పోలీసులు నెంబర్ 41 నోటీసును జారీ చేసిన విషయం తెలిసిందే. అశ్వత్థరావు అదృశ్యం కేసుపై తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు ఆ నోటీసులో తెలిపారు. ఈ నోటీసును నారాయణ విద్యాసంస్థల కార్పొరేట్ ఆఫీసులో అందించినట్టు పోలీసులు చెప్పారు.
లెక్చరర్ను కొట్టారు...
అదలావుంటే, నారాయణ కాలేజీలో ఒక లెక్చరర్ను డీన్ కొట్టిన సంఘటన వివాదంగా మారింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారందరినీ డీన్లుగా పెద్ద పెద్ద పోస్టులో ఉంచి ఎంతో సీనియర్లయిన టీచర్లను సైతం తెలంగాణలో దిగువ స్థాయిలోనే కొనసాగిస్తున్నారని లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
నారాయణ లెక్చరర్లు అంతా క్లాసులు బహిష్కరించి విఠల్వాడీ కాలేజీ ముందు ధర్నాకు దిగారు. దీంతో శ్రీ చైతన్య కార్పొరెట్ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది అంతా క్లాసులను బహిష్కరించారు. కొద్ది మందికి మాత్రం కోట్ల రూపాయిలు వేతనాలుగా చెల్లిస్తున్న సంస్థ మిగిలిన వారికి మాత్రం నామమాత్రపు వేతనాలతో సరిపెడుతోందని, జీతాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. దాంతో హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో గురువారం నాడు క్లాసులు జరగలేదు.












Click it and Unblock the Notifications