మామ ప్రాణం తీసిన కోడలి వివాహేతర సంబంధం
హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వ్యక్తి దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. బాధిత వ్యక్తి హత్యకు ఆమె కోడలే కారణమని తేల్చారు. డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమే.. తన మామను కడతేర్చిందని పోలీసులు తెలిపారు.
మీడియా సమావేశంలో ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, సీఐ పి.భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డినగర్కు చెందిన టెకుమ్సే మాజీ ఉద్యోగి పుట్టి రామకృష్ణ అలియాస్ కిష్టయ్య(64) మార్చి 2న దారుణ హత్యకు గురయ్యారు. రామకృష్ణను అతని డ్రైవర్ గిరినగర్కు చెందిన అక్కిరెడ్డి శ్రీధర్(24), ఇతని స్నేహితుడు షేక్ షఫీ(23)తో కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
శ్రీధర్ డ్రైవర్గా పనిచేస్తూ రామకృష్ణ కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన రామకృష్ణ.. అతడ్ని ఊరు వదిలి వెళ్లిపోవాలని ఇటీవల బెదిరించాడు. దీంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించిన శ్రీధర్.. స్నేహితుడు షఫీకి రూ.50వేలు ఇస్తానని చెప్పి హత్యకు ప్రణాళిక వేశాడు.
ఈ క్రమంలో మార్చి 2న ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 11గంటల సమయంలో ఒంటరిగా తలుపు తీసి పడుకున్న రామకృష్ణపై రాడ్డు, కర్రతో దాడిచేసి తల పగులగొట్టి చంపి పారిపోయారు.
ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా శ్రీధర్, షఫీని మంగళవారం అరెస్టుచేసి వారి నుంచి ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు, రాడ్డు, కర్ర స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు.