3అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిన పాప, కాపాడపోయిన పదేళ్ల చిన్నారి: ఇద్దరూ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే కాలనీలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇధ్దరు చిన్నారులు మూడంతస్తుల భవనం నుంచి కిందపడి మృతి చెందారు.
18 నెలల చిన్నారి శ్రేయను కాపాడబోయి పల్లవి అనే పదేళ్ల చిన్నారి కాలుజారి పడిపోయింది. మూడో అంతస్తు నుంచి చిన్నారి కిందపడుతుండగా పల్లవి కాపాడబోయింది. భవనంపై నుంచి పాప పడిపోకుండా కొద్దిసేపు చిన్నారిని పల్లవి పట్టుకుంది.
చిన్నారి టీషర్ట్ చినిగిపోవడంతో పద్దెనిమిది నెలల పాప శ్రేయ మృతి చెందింది. చిన్నారిని పట్టుకునే క్రమంలో పల్లవి కూడా కాలు జారి భవనంపై నుంచి పడి మృతి చెందింది.
ఈ ఘటనను పై అంతస్తు నుంచి చూస్తూ చిన్నారులను కాపాడేందుకు ఓ మహిళ ప్రయత్నం చేసింది. కానీ కిందకు వచ్చేసరికి ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాలతో మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రేయ, పల్లవిలు భవనం టెర్రాస్ పైన ఆడుకుంటున్నారు. ఆ సమయంలో శ్రేయ జారి పడింది. శ్రేయను కాపాడే క్రమంలో పల్లవి ప్రాణాలు కోల్పోయింది.