జానారెడ్డికే మైక్ ఇస్తున్నారు: ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్య, రేవంత్ ఇల్లు ముట్టడి
కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో మరికొంతమంది సీనియర్లు ఉన్నారని, కానీ కేవలం జానారెడ్డికి మాత్రమే మైక్ ఇస్తున్నారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: స్పీకర్ మదుసూధనా చారిని కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎం సభ్యులు గురువారం నాడు కలిశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో మరికొంతమంది సీనియర్లు ఉన్నారని, కానీ కేవలం జానారెడ్డికి మాత్రమే మైక్ ఇస్తున్నారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆయనతో పాటు మమ్మల్నీ గౌరవించాలన్నారు. శాసన సభ వ్యవహాలా మంత్రి ఉన్నది ఎదురు దాడి చేసేందుకా అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులు పదిహేను మంది అని, కోర్టులో స్పీకర్ అఫిడవిట్ దాఖలు చేశారని, అసెంబ్లీలో టిడిపి సభ్యులు ముగ్గురే అని అంటున్నారని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అడిగారు. భూసేకరణ బిల్లు పైన తాను మాట్లాడుతుంటే హరీష్ రావుకు మైక్ ఇచ్చారని, ఆ తర్వాత సీఎం మాట్లాడారని, తిరిగి తనకు మైకు ఇవ్వలేదన్నారు. కనీసం నిరసన తెలిపే అవకాశమివ్వరా అన్నారు.
కేసీఆర్ టార్గెట్ ఎఫెక్ట్: ఇన్నాళ్లకు.. కోదండరాంను అంతమాట అనేశారు!
దీని పైన స్పీకర్ మాట్లాడుతూ.. అలా భావిస్తే ఎలాగని ప్రశ్నించారు. అరిచే వారికే మైక్ ఇస్తున్నారని వాళ్లు అంటున్నారని, మైకే ఇవ్వడం లేదని మీరంటున్నారని విపక్షాలతో స్పీకర్ అన్నారు.
రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి
తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఇంటిని మాల మహానాడు నేతలు గురువారం ముట్టడించారు. జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన నివాసానికి మాల మహానాడు నేతలు పెద్దఎత్తున చేరుకున్నారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.