పెద్దవిగా చేసుకోవద్దు: కేసీఆర్, బాబులకు వెంకయ్య హితవు
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడారు. 'ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పెద్దవిగా చేసుకోకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి' అని వెంకయ్య నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. విడిపోగానే సమస్యలు పరిష్కారం కావని అన్నారు.

జ్యోతి ప్రజ్వలన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలనూ నెరవేరుస్తున్నామని వెంకయ్య పునరుద్ఘాటించారు. విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ పోస్టల్ సర్కిల్ను ఆయన సోమవారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన వేడుకలో లాంఛనంగా ప్రారంభించారు.

పోస్టల్ సర్కిల్ ప్రారంభం
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా పరస్పరం సహకరించుకుందామన్నారు. సమస్యలు ఎదురైతే వాటిని పెద్దవిగా చేసుకోకుండా పరిష్కరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సూచించారు.

హామీల అమలు
విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేస్తామని వెంకయ్య పునరుద్ఘాటించారు. విడిపోయిన వెంటనే సమస్యలన్నీ పరిష్కారం కావని ఆయన ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలను ఉదహరించారు. కొన్నింటి విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉంటాయని ఆయన తెలిపారు. త్వరలోనే తెలంగాణ బిఎస్ఎన్ఎల్, ఎపీ బిఎస్ఎన్ఎల్ కూడా ఏర్పాటవుతాయని తెలిపారు.

వెంకయ్యనాయుడు
వచ్చే నెలలో విజయవాడలో తాత్కాలికంగా ఏపీ పోస్టల్ సర్కిల్ ఏర్పాటు అవుతుందని, ఆ తర్వాత అమరావతికి తరలిస్తామన్నారు. సైనికుల్లా పోస్టల్ సిబ్బంది కూడా సేవలందించాలని వెంకయ్య నాయుడు సూచించారు.
డాక్ సేవా సదన్లను ఆన్లైన్ చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు.

బహూకరణ
పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు ఏటీఎంలు అందజేసే సౌకర్యం తీసుకుని రావడం గొప్ప విషయమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కాగా, పోస్ట్మ్యాన్ ఒక్కడే ఊరందరికీ దోస్త్ అని చెప్పడంతో అందరూ కరతాళధ్వనులు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications