శ్రీవారిని దర్శించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్: భార్యతో కలిసి ఏడుకొండలవాడి సేవలో
తిరుపతి: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. రోజూ 20 వేలమంది భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వడంతో కరోనా కాలంలో ఇంతకుముందు లేని కోలాహలం తిరుమలలో నెలకొంది. హరి నామస్మరణతో సప్తగిరులు మారుమోగిపోతోన్నాయి. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించడానికి ప్రముఖులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే, ఆయన భార్య ఈ తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సందర్భంగా ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి కేఎస్ జవహర్ రెడ్డి, ఆలయ అర్చకులు బొబ్డే దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శాలువ కప్పి సన్మానించారు. అర్చకుల వేదమంత్రుల మధ్య వారికి వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
గురువారం రాత్రే ఎస్ఏ బొబ్డే దంపతులు తిరుమలకు చేరుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి, కేఎస్ జవహర్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. పద్మావతి అతిథిగృహంలో బస చేశారు.
ఈ తెల్లవారు జామున వారు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం ముగించుకున్న అనంతరం అతిథి గృహానికి చేరుకున్న ఆయనతో వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించిన ఏర్పాట్ల గురించి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న కరోనా ప్రొటోకాల్, మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు.