జగన్ను ఇరుకునపెడుతూ.. చంద్రబాబుకు కొత్త తలనొప్పి: తెలంగాణ ఎంపీపై కేశినేని నాని ప్రశంసలు
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని విజయవాడలో నిర్వహించిన సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేవిధంగా వ్యాఖ్యలు చేసిన ఆయన.. పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కొత్త తలనొప్పి తెచ్చారు.

హైదరాబాద్ ఎంపీపై నాని ప్రశంసలు..
సీఏఏ వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో కేశినేని నాని మాట్లాడుతూ హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓవైసీని ఆరేళ్లుగా చూస్తున్నా.. దేశంలో పార్లమెంటేరియన్ అంటే ఇలా ఉండాలనిపించేలా వ్యవహరిస్తున్నారని కేశినేని నాని కొనియాడారు.

భారతీయుణ్ణి అని నిరూపించుకోవాలా?
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మతం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని, సీఏఏ, ఎన్ఆర్సీ తీసుకొస్తున్నారని నాని మండిపడ్డారు. తాను భారతీయుణ్ణి అని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఆధార్ లాంటి డాక్యుమెంట్లేవీ పనికి రావంటున్నారని ఆరోపించారు. తన తల్లి పౌరసత్వాన్ని తాను ఎలా నిరిపించుకోవాలని ఆయన ప్రశ్నించారు.

సీఏఏ, ఎన్ఆర్సీకి మద్దతివ్వలేదంటూ..
కేంద్రం ఎన్ఆర్సీ, సీఏఏను వెనక్కి తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. 22 మంది వైసీసీ ఎంపీలు సీఏఏకు అనుకూలంగా ఓటేశారని.. టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా సీఏఏకు అనుకూలంగా ఓటేశారని.. అయితే, తాను మాత్రం వ్యతిరేకించి బయటికి వచ్చానని చెప్పుకొచ్చారు ఈ టీడీపీ ఎంపీ.

తీర్మానం చేయాలంటూ జగన్కు సవాల్..
కేరళ తరహాలోనే ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు టీడీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలుకుతారని చెప్పారు. మూడు రాజధానుల బిల్లుకు బదులు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే తామేంతో సంతోషించేవాళ్లమని అన్నారు.
సీఏఏను సవాల్ చేస్తూ జగన్ సర్కారు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్నారు.. లేదంటే తానే దాఖలు చేస్తానని చెప్పుకొచ్చారు.
Recommended Video


చంద్రబాబుకు కొత్త తలనొప్పే..
అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకునపెట్టాలని చేసిన ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కొత్త తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. సీఏఏ, ఎన్ఆర్సీ తీర్మానం చేయకపోతే.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం ఉంది.. ఒకవేళ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెడితే అందుకు టీడీపీ సభ్యులు తప్పనిసరిగా మద్దతు తెలపాల్సి ఉంది. పార్లమెంటులో సీఏఏకు మద్దతు తెలిపి, అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానానికి మద్దతు తెలిపినా కూడా టీడీపీకి విమర్శలు తప్పేలా లేవు. దీంతో ఎటూ చూసినా ఇది చంద్రబాబుకు కొత్త తలనొప్పేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేగాక, చంద్రబాబును ఓడించేందుకు ఏపీకి కూడా వెళ్తామంటూ ఎన్నికల ముందు వ్యాఖ్యలు చేసిన ఓవైసీపై నాని ప్రశంసలు కూడా టీడీపీకి కొంత ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications