లోకేష్, విజయసాయి, ట్వీట్ల యుద్దం..! పై చేయి సాధించేందుకు వినూత్న ప్రయత్నం..!!
అమరావతి/హైదరాబాద్ : ప్రస్తుత రాజకీయాలు సోషల్ మీడియా వేదికగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా.. అంటే ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తిట్ల వర్షం కురుపిస్తున్నారు. రాష్ట్రంలో చర్చోపచర్చలకి దారితీస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఏ పుంతలు తొక్కుతుందోననే ఆసక్తి నెలకొంది. "బంతి పువ్వుతో నువ్వొకటేస్తే తమలపాకుతో నేను రెండేస్తా'' అన్న చందంగా ఉంది ఏపీలో ప్రస్తుత రాజకీయం. సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధమే జరుగుతోందక్కడ. ఫేస్బుక్ లేదా ట్విట్టర్ వంటి మాధ్యమాల ద్వారా అధికార- విపక్ష నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోరు పతాకస్థాయికి చేరింది.ముఖ్యంగా విజయసాయి రెడ్డి, నారా లోకేష్ మద్య రోజూ సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్దమే జరుగుతోంది.
విజయ సాయి రెడ్డిది రాజ్యాంగ ఉల్లంఘన: అర్హత కోల్పోయారు
Recommended Video
ఏపిలో ట్వీట్ల సాంప్రదాయం..! కొత్తగా పుట్టుకొచ్చిన వింత ఆచారం..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ వర్ల రామయ్య వంటివారు కూడా ట్వీట్ల మీద ట్వీట్లు గుప్పిస్తూ వేడిపుట్టిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా సంధిస్తున్న విమర్శనాస్ర్తాలు చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్ పెట్టిన పోస్ట్ అందరినీ విశేషంగా ఆకర్షించింది. "తాజ్మహల్ ఆగ్రాలో ఉంది కాబట్టి సరిపోయింది.. అది కృష్ణాతీరంలో ఉంటే ఏమయ్యేదో?'' అంటూ ఆయన చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారింది.
ట్వీటుకు ట్వీటుతోనే సమాధానం..! వినూత్న రీతిలో రెచ్చి పోతున్న ఏపి నేతలు..!!
రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలు చెప్పడానికి, ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టడానికి గతంలో ప్రెస్మీట్లు ఏర్పాటుచేసేవారు. వాటికి తొలినాళ్లలో పత్రికా ప్రతినిధులు హాజరయ్యేవారు. ఆ వార్తలు అచ్చులో వెలువడటానికి ఒక రోజు పట్టేది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వేగం పెరిగింది. ఫలితంగా ప్రెస్మీట్ అంటే సుమారు 50 నుంచి వందమంది వరకు వస్తున్నారు. వాళ్లందరినీ పిలవడం, తమ సమయం కేటాయించడం ఎందుకు అనుకున్నారో ఏమో.. నేటి నాయకులు ట్రెండ్ మార్చారు. ట్విట్టర్, ఫేస్బుక్లను తెగ వాడేస్తున్నారు. ఎడాపెడా పోస్టులతో దంచేస్తున్నారు. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే నాయకులకి అంత తీరిక ఉండదు కదా! అందుకే వారు తమ అభిప్రాయాలు చెప్తే వాటిని అర్థవంతంగా తీర్చిదిద్ది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు గాను కొంతమందిని నియమించుకుంటున్నారు. ఆయా వ్యక్తులు తమ పనిని చురుకుగా కొనసాగిస్తున్నారు.
విజయసాయి, లోకేష్ మద్య తారా స్థాయిలో ట్వీట్లు..! చెలరేగిపోతున్న నేతలు..!!
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది పాటు మౌనంగా ఉంటామని తెలుగుదేశం పెద్దలు తొలుత చెప్పారు. కొత్త ప్రభుత్వానికి ఆ మాత్రం సమయం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని కూడా వారు చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నందున తాము నోరు తెరవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల్లో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సమాయత్తమయ్యారు కూడా! ప్రకాశంజిల్లా నుంచి ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు! విత్తనాల కొరత, విద్యుత్ కోతలు వంటి అంశాలపై చంద్రబాబు, నారా లోకేశ్ కూడా సీరియస్గా స్పందించారు.
ప్రశ్నించాలన్నా, సమాధానం చెప్పాలన్నా ట్వీటే..! ఏపి రాజకీయాల్లో నయా కల్చర్..!!
ఏది ఏమైనా... ట్విట్టర్, ఫేస్బుక్ వేదికలుగా లోకేశ్, కేశినేని నాని, విజయసాయిరెడ్డి పెడుతున్న పోస్టులు, చేస్తున్న విమర్శలు ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారాయి. లోకేశ్ బయటికి వచ్చి మాట్లాడితే తప్పులు దొర్లుతాయనే ఉద్దేశంతో ట్విట్టర్లో వేరే వారి ద్వారా విమర్శలు చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తే వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారంటూ టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా రసవత్తర రాజకీయం సాగుతున్న మాట వాస్తవం. సోషల్ మీడియా వార్కి అటు పత్రికలు, ఇటు ప్రసార మాధ్యమాలు కూడా బాగానే ప్రచారం కల్పిస్తున్నాయని అన్ని పార్టీ నేతలు సంబరపడుతున్నారు.