చంద్రబాబు ఓదార్పు యాత్ర: 5 లక్షల ఆర్దిక సాయం: జగన్ పాలనే లక్ష్యంగా....!
నాడు వైసీపీ అధినేత తన తండ్రి కోసం మరణించిన వారి కోసం ఓదార్పు యాత్ర చేసారు. ఇప్పుడు టీడీపీ అధినేత వైసీపీ దాడుల్లో మరనించిన కార్యకర్తల కోసం పరామర్శ యాత్ర చేయాలని నిర్ణయించారు. టీడీపీ అప్పుడే వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్నికల తరువాత తమ పార్టీ నేతల మీద 130 దాడులు జరిగాయని..6 మంది కార్యకర్తలు మరణించారని టీడీపీ నేత లు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి జగన్ను లక్ష్యంగా చేసుకోనున్నారు.
చంద్రబాబు పరామర్శయాత్ర...
మరో పది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవతున్న వేళ..టీడీపీ అధినేత చంద్రబాబు కార్యకర్తలతో మమేకం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే గుంటూరు లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారానికి అయిదు రోజులు ఉండాలని నిర్ణయించిన చంద్రబాబు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ స్ట్రాటజీ సమావేశంలో తాజా పరిస్థితుల పైన చంద్రబాబు నేతలతో చర్చించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీని కోసం పరామర్శ యాత్ర పేరుతో మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యుల ను పరామర్శించి ఒక్కో కుటుంబానికి అయిదు లక్షలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కార్యకర్తల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీ నేతల పైన కక్ష్య సాధింపు చర్యలు మినహా..అభివృద్ది ఏమీ పట్టటం లేదని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని భావించినా వారి వ్యవహార శైలి చూసిన తరువాత స్పందించిక తప్పటం లేదని అభిప్రాయపడ్డారు.

నాడు అభివృద్ది..నేడు కక్ష్య సాధింపు
స్ట్రాటజీ కమిటీ సమావేశం అనంతరం పార్టీ కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ప్రభుత్వం కావడంతో ఎన్నో సమస్యలు ఉండేవని, వాటన్నింటినీ పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృ ద్ధి పథంలో తీసుకెళ్లానని చెప్పారు. కట్టుబట్టలతో వచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని వివరించారు. తమ ప్రభుత్వంలో ఎప్పుడూ ధర్మాన్ని విస్మరించలేదని చెప్పుకొచ్చారు.గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని చెప్పాలంటూ సబ్కమిటీ వేసిన నాలుగు రోజులకే ఎవరికీ సీరియస్నెస్ లేదని అధికారులను సీఎం జగన్ హెచ్చరించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అవినీతిని ఎలాగైనా వెతికిపట్టండని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ ఎప్పుడూ దాడులను ప్రోత్సహించలేదని.. ఇప్పుడు తమ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 37 ఏళ్లుగా కార్యకర్తల పార్టీగా టీడీపీ ఉందని..ప్రతీ కార్యకర్తను కాపాడుకొనే బాధ్యత తనదేనని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications