ఏ రాష్ట్రం ఇంత దగా పడలేదు.. అప్పుడు చెన్నై, ఇప్పుడు హైదరాబాద్: జగన్ భావోద్వేగ ప్రసంగం
అమరావతి: దేశంలో ఏ రాష్ట్రానికి జరగని అన్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం(నవంబర్ 1న) ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

ఏ రాష్ట్రం ఇంత దగా పడలేదు..
ఆంధ్రరాష్ట్రం కోసం ఎందరో మహానుభావులు పోరాడారని, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత దగా పడలేదని అన్నారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. పదేళ్లుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

కష్టాల తర్వాత మంచిరోజులే..
భవిష్యత్ తరాలు బాగుపడేలా నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు బాగుపడేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అందరూ కలిసి రావాలని అన్నారు.

విభజన ఊహించలేదు.. అప్పుడు చెన్నై..
వైఎస్సార్ ఉన్నంత కాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎవ్వరూ ఊహించలేదని జగన్ అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల శ్రమ, పరిశ్రమ అప్పుడు చెన్నై, ఇప్పుడు హైదరాబాద్లోనే మిగిలిపోయిందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. గొప్ప చారిత్రక నేపథ్యం, సంస్కృతికి కలిగిన రాష్ట్రానికి గవర్నర్గా ఉండటం గర్వంగా ఉందని అన్నారు. శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు పాలించిన గొప్ప నేల ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రోద్యమంలో ఈ రాష్ట్రానికి కీలక భూమిక ఉందని అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎందరో మహానుభావులు వచ్చారని చెప్పారు. జాతీయ పతాకాన్ని రూపొందించి విజయవాడకు చెందని పింగళి వెంకయ్య గర్వకారణంగా నిలిచారని అన్నారు.












Click it and Unblock the Notifications