విశాఖ నుంచి పాలనపై తేల్చేసిన జగన్- లేట్ కావొచ్చేమో గానీ వెళ్లడం మాత్రం పక్కా
విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చబోతోన్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలే ప్రకటించారు. జులైలో అక్కడికి వెళ్లనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అధికార వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. ఒకవంక కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తూనే మరోవంక- నిర్మాణాలకూ పూనుకుంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత.. దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మరో కీలక అడుగు వేసింది అధికార పార్టీ. పార్టీ పరంగా తరలింపు పనులను మొదలు పెట్టింది.

జాప్యం లేకుండా..
విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామని, తాను కూడా అక్కడికే తరలి వెళ్లబోతోన్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. విశాఖకు తరలి వెళ్లడంపై తొలిసారిగా దేశ రాజధానిలో పెదవి విప్పారు. తాను కూడా త్వరలోనే విశాఖకు తరలి వెళ్లబోతోన్నానని, పెట్టుబడులు పెట్టడానికి అక్కడ అనువైన వాతావరణం ఉందంటూ ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో స్పష్టం చేశారు. అమరవతి నుంచి సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం తరలి వెళ్లడం ఇక ఖాయమైంది.

జులై నుంచి..
ఇక తాజాగా వైఎస్ జగన్ మరోసారి ఈ అంశంపై స్పందించారు. జులైలో విశాఖపట్నానికి తరలివెళ్లనున్నట్లు ప్రకటించారు. జులైలో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కొద్దిసేపటి కిందటే ముగిసిన మంత్రివర్గ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించడంలో ఇక ఏ మాత్రం జాప్యం చేయదలచుకోలేదని పేర్కొన్నారు. జులైలో విశాఖకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

పనితీరును గమనిస్తోన్నా..
పనితీరు సరిగ్గా లేని మంత్రులపై వేటు వేయడానికి కూడా తాను వెనుకాడబోనని జగన్ తేల్చి చెప్పారు. ఏడు స్థానాల్లో ఎమ్మెల్యే కోటా కింద శాసన మండలి స్థానాలను గెలుచు కోవాల్సి ఉంటుందని సూచించారు. అందరి పనితీరును తాను గమనిస్తోన్నానని, తేడా వస్తే మంత్రి వర్గంలో మార్పులు తప్పవని ఆయన సున్నితంగా హెచ్చరించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు, సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని అన్నారు.

ప్రభుత్వ భవనాల్లో.
విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటి నుంచి పరిపాలన సాగిస్తామంటూ మంత్రులు చెబుతున్నారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామని పేర్కొంటోన్నారు. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన భవనాలు కూడా ఖాళీగా ఉన్నాయని, భీమిలి రోడ్డులోని భవనాలనే సెక్రటేరియట్ గా వాడుకుంటామనీ స్పష్టం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications