దసరాకు జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతోన్నారు- మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నానికి రాజధానిని తరలించాలనే ప్రతిపాదనలను ఎప్పటినుంచో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మూడు రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ- కొన్ని న్యాయపరమైన అడ్డంకుల వల్ల ఇవి కార్యరూపం దాల్చట్లేదు.
ఈ ఏడాది మాత్రం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ దిశగా దూకుడును పెంచింది. ఒకవంక కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తూనే మరోవంక- నిర్మాణాలకూ పూనుకుంది. విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామని, తాను కూడా అక్కడికే తరలి వెళ్లబోతోన్నానంటూ వైఎస్ జగన్ సైతం ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో జాప్యం చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది.

ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలిస్తామంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఇటీవలే స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీధోరణిని పాటించే ప్రసక్తే లేదని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమౌతుందనీ వెల్లడించారు.
విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటి నుంచి పరిపాలన సాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన భవనాలు కూడా ఖాళీగా ఉన్నాయని అన్నారు. భీమిలి రోడ్డులోని భవనాలనే గా వాడుకుంటామనీ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
ఇదే విషయంపై తాజాగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా నాటికి వైఎస్ జగన్ సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతోన్నారని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న రాజధాని తరలింపు దసరాలో మొదలవుతుందని చెప్పారు.

వైఎస్ఆర్సీపీ నిర్వహించిన పార్టీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం, శ్రేణులు, రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటోన్నట్లుగా దసరా నాటికి విశాఖపై జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని, శుభ పరిణామాలు సంభవిస్తాయని అన్నారు.
దసరాకు విశాఖ ప్రజల కోరిక తీరబోతోందని అమర్నాథ్ తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలాపేట పోర్ట్ నిర్మాణం, విశాఖలో ఇనార్బిట్ మాల్, అదాని డేటా సెంటర్.. వంటివి ఏర్పాటవుతున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications