నర్సీపట్నంలో సినీ ఫక్కీలో గంజాయి ముఠా ఛేజ్- పారిపోతూ కార్లను గుద్దేసి-చెరువులో దూకినా
విశాఖ జిల్లా నుంచి అక్రమ గంజాయి రవాణా వివిధ రాష్ట్రాలకు జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏపీ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అయితే అడపాదడపా గంజాయి స్మగ్లర్లు, పెడ్లర్లను అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఇవాళ విశాఖ జిల్లా నర్సీపట్నంలో పోలీసులు మహారాష్ట్రకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకునే ప్రయత్నం సినీ ఫక్కీని తలపించింది.
మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లింగ్ ముఠా బీభత్సం సృష్టించింది. నర్సీపట్నంలో ఈ ముఠా ప్రయాణిస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ గుర్తించారు. దాంతో ఎస్ఐ ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన స్మగ్లర్లు కారు మరింత వేగంగా నడిపి,ఇతర వాహనాలను ఢీకొట్టుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించారు. కాసేపు ఛేజ్ తర్వాత స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారు వదిలేసి చెరువులోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు.
రోడ్డుపై కారును వదిలేసి పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. వెంటనే ఈ విషయాన్ని ట్రాఫిక్ ఎస్ఐ, నర్సీపట్నం రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు. చెరువు చుట్టూ పోలీసులను మోహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మిగతా వారు పారిపోయినట్లు తెలుస్తోంది. వీరి నుంచి గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన వివరాల్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, దీని వెనుక ఎవరున్నారనే దానిపై వివరాలు తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.