డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు- ఏపీలో విపక్షాలన్నీ గప్ చుప్- ఎదురుదాడి వికటించిందా ?
విశాఖ డాక్టర్ సుధాకర్ పై సీబీఐ మూడు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులు ఇప్పుడు ఏపీలో విపక్షాలను ఒక్కసారిగా షాక్ కు గురి చేశాయి. గతంలో డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వం కక్షసాధిస్తోందని ఆరోపించిన విపక్షాలు, ఆయన తల్లి కావేరీ బాయి సీబీఐ తాజా కేసుతో ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డారు.
Recommended Video

సుధాకర్ కేసులో సీబీఐ దూకుడు....
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో అధికారులు దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. అయితే ఈ కేసులో మొదట ప్రభుత్వ తప్పిదాలపై దృష్టిసారించిన సీబీఐ .. ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ చేసిన తప్పిదాలపైనా కేసులు నమోదు చేసింది. కానిస్టేబుల్ వెంకటరమణ ఫిర్యాదుతో సీబీఐ నమోదు చేసిన సెక్షన్ 353, 427, 506 సెక్షన్ కేసులతో ఈ వ్యవహారం అనూహ్యంగా మలుపు తిరిగింది. ప్రభుత్వ అధికారులతో పాటు సుధాకర్ పైనా కేసులు నమోదు చేయడం ద్వారా ఈ కేసులో సీబీఐ నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నట్లు తేలిపోయింది.

సీబీఐ కేసుపై నోరుమెదపని విపక్షాలు...
గతంలో డాక్టర్ సుధాకర్ ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు పాల్పడుతోందని, దళితుడు కాబట్టే ఇలా చేస్తున్నారని విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన తీవ్రంగా దుమ్మెత్తిపోశాయి. వారు కోరుకోకపోయినా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో దాన్ని స్వాగతిస్తూ నానా హంగామా చేశాయి. సుధాకర్ తల్లి కావేరీ బాయి కూడా సీబీఐ దర్యాప్తుతో తన బిడ్డకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే సీబీఐ తాజాగా మూడు సెక్షన్ల కింద డాక్టర్ సుధాకర్ పై నమోదు చేసిన కేసులతో వీరంతా ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డారు.

వికటించిన ఎదురుదాడి...
డాక్టర్ సుధాకర్ పీపీఐ కిట్లు, మాస్క్ ల కొరతపై ప్రశ్నించగానే దాన్ని అందుకుని ఆయనకు మద్దతుగా రంగంలోకి దిగిన విపక్షాలు అప్పటి నుంచి ఆయన సస్పెండ్ కావడం, ఆ తర్వాత రోడ్డుపై ప్రభుత్వాధినేతలను దుర్భాషలాడటం చేసినా సమర్ధిస్తూనే వచ్చాయి. చివరకు రోడ్డుపై డాక్టర్ సుధాకర్ మద్యం మత్తులో చేసిన వీరంగం చూశాక అయినా ఇలాంటి చర్యలను సమర్ధించబోమని ఒక్కరూ చెప్పలేదు. కానీ హఠాత్తుగా సెషన్స్ జడ్ఝికి సుధాకర్ వాంగ్మూలం ఆధారంగా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించగానే టీడీపీతో పాటు ఇతర విపక్షాల నేతలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి. ఈ కేసులో ప్రభుత్వాన్న్ సీబీఐ దోషిగా తేలుస్తుందని అంతా ఆశించారు. కానీ తాజాగా సీబీఐ ఇరువర్గాలపైనా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లతో పరిస్ధితి పూర్తిగా మారిపోయింది.

మౌనమే మేలంటున్న విపక్షాలు...
సీబీఐ తాజాగా డాక్టర్ సుదాకర్ పై నమోదు చేసిన కేసు విషయంలో స్పందించేందుకు విపక్షాలు నిరాకరిస్తున్నాయి. సీబీఐ విచారణను స్వాగతించిన విపక్షాలు తాజాగా నమోదైన కేసులపై ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో సుధాకర్ కు మద్దతిచ్చిన విషయంలోనూ సీబీఐ దూకుడుగా వెళితే ఏమవుతుందన్న భయం వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం దీనిపై మౌనంగా ఉంటేనే మేలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. త్వరలో ఎలాగో సీబీఐ విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ వేసేలా కనిపిస్తోంది. కాబట్టి మొత్తం విచారణ పూర్తయ్యాకే దీనిపై స్పందిస్తే మేలనే అభిప్రాయం విపక్ష పార్టీల్లో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications