వైజాగ్ స్టీల్..నెక్స్ట్ లెవెల్: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు..రాస్తారోకోలు
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నెలరోజుల నుంచి కొనసాగుతోన్న ఉద్యమాలు, ఆందోళనలు.. మరింత తీవ్రతరమయ్యాయి. ఇన్ని రోజులు విశాఖపట్నం నగరానికే పరిమితమైన ఈ నిరసన కార్యక్రమాలు ఇక రాష్ట్రవ్యాప్తం కానున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రైవేటీకరణకు సంబంధించిన నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలను నిర్వహించబోతోంది.
రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, బైఠాయింపులతో కొద్దిరోజులుగా నిరసనలను నిర్వహిస్తోన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం వైపే మొగ్గు చూపింది. దీనికోసం ఇటీవలే 'ఇంటర్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆన్ స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ విశాఖ స్టీల్ప్లాంట్' పేరుతో ఒక కమిటీని సైతం నియమించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి- కార్మిక సంఘాలు ప్రతినిధులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులను మరింత ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఫలితంగా- ఇక రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి వారు పిలుపునిచ్చారు.
ఈ కమిటీ ఇచ్చిన పిలుపునకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రోడ్లను దిగ్బంధించనున్నట్టు ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ వెల్లడించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 50 ఏళ్ల కిందట చేపట్టిన ఉద్యమాల గురించి ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాధాన్యతను తెలియజేస్తామని చెప్పారు. మోడీ సర్కార్ అనుసరిస్తోన్న ప్రభుత్వరంగ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. తాము చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. తాము నిర్వహించ తలపెట్టిన రాస్తారోకోకు మద్దతు పలకాలని కోరారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడమంటూ జరిగితే- అది అక్కడితో ఆగబోదని, ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఒక్కటొక్కటిగా తెగనమ్ముతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఈ దశలోనే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగర పరిధిలోని కూర్మన్నపాలెం జంక్షన్తోపాటు గాజువాక, మద్దిలపాలెం, ఇసుకతోట, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహిస్తామని అన్నారు.