విశాఖలో ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్- కేంద్రానికి ప్రతిపాదనలు..!!
విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక డ్రోన్ పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇవ్వాళ ఆయన రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను విశాఖకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత - 144 సెక్షన్: బోర్డర్ దాటితే.. అరెస్టులే
నాలుగో పారిశ్రామిక విప్లవంగా..
వివిధ రంగాల్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలను చేపట్టడానికి విశాఖపట్నంలో జాతీయ స్థాయి రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో సోమవారం జీరో అవర్లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ప్రస్తావించిన నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా డ్రోన్ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చిందని సాయిరెడ్డి గుర్తు చేశారు.
వ్యవసాయం, రక్షణ, రవాణా రంగాల్లో..
నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఆవిష్కృతమైన అత్యంత కీలక సాంకేతిక పరిజ్ఞానాలలో డ్రోన్ టెక్నాలజీ కూడా ఒకటని ఆయన వ్యాఖ్యానించారు. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత వ్యవసాయం, రక్షణ, రవాణాతోపాటు అనేక రంగాలలో డ్రోన్ల వినియోగం పెరిగిందని సాయిరెడ్డి అన్నారు.
మందులను చల్లడంతో పాటు..
డ్రోన్ టెక్నాలజీ, దాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా దేశాభివృద్ధి కోసం వినియోగించడంలో భారత్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. దీన్ని మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకించి- వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని సూక్ష్మస్థాయి వరకు తీసుకుని వెళ్లాలని సూచించారు. క్రిమిసంహారక మందులను చల్లడం, పొలాల్లో తేమ శాతాన్ని పర్యవేక్షించడానికి డ్రోన్లను వినియోగించాలని అన్నారు.
తక్కువ శ్రమతో..
డ్రోన్ టెక్నాలజీ సాయంతో తక్కువ శ్రమతో రైతులు పంట దిగుబడులను 15 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీలో 65 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడ్డారని, ఈ రంగంలో కొత్త పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాగులో ప్రయోగాలకు రాష్ట్ర రైతాంగం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాష్ట్రం అపారమైన మానవ వనరులను కలిగి ఉందని విజయసాయి రెడ్డి రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు.
వ్యవసాయ రంగంలో..
ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడంలో ఏపీ.. దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఉద్యానపంటలు, పండ్లు, కూరగాయల సాగులో టాప్లో ఉందని పేర్కొన్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ రంగంలో డ్రోన్ల పరిజ్ఞానాన్ని మరింత విస్తృత పరచడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో జాతీయ డ్రోన్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.