నిన్న తమ్ముడు - ఇవ్వాళ అన్న: ఫోకస్ అంతా దాని మీదే..!!
విజయనగరం: విజయనగరం జిల్లాలోని ఓ గ్రామం గుంకలాం..ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువైంది. పేదలందరికీ ఇళ్లు పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ నిర్మిస్తోన్న జగనన్న కాలనీ- దీనికి కారణమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజవర్గాల్లోనూ ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నప్పటికీ- గుంకలాం మీదే జనసేన పార్టీ అగ్ర నాయకత్వం దృష్టి పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఆదివారమే విజయనగరం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. గుంకలాంలో జగనన్న కాలనీలను నిర్మాణాలను ఆయన పరిశీలించారు. జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు పేరుతో పార్టీ తరఫున చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దీని తరువాత ఆయన మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఇవ్వాళ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు గుంకలాంను సందర్శించారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖపట్నానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంకలానికి చేరుకున్నారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో కలిసి గుంకలాంలో జగనన్న కాలనీకి వచ్చారు. ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల వైశాల్యం గురించి ఆయన ఆరా తీశారు.
పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ జనసేన ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు పేరుతో ఆందోళన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోన్నారా పార్టీ నాయకులు. అన్ని నియోజకవర్గాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలిస్తోన్నారు. ఇందులో భాగంగానే నాగబాబు గుంకలాం జగనన్న కాలనీని సందర్శించారు. కాగా కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా మంగళగిరి వంటి కొన్ని చోట్ల వారికి ఇళ్ల లబ్దిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన విషయం తెలిసిందే.