జగన్కు జీవితాంతం రుణపడి ఉంటా: టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత శ్రీనివాస్ భావోద్వేగం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ ప్రశంసలు కురిపించారు. తాను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానంటూ భావోద్వేగానికి గురయ్యారు.
విజయనగరం: కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, చివరికి పార్టీని కూడా చూడం.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పే మాట ఇది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచీ దీన్ని పకడ్బందీగా అమలు చేస్తూ వస్తోన్నారాయన. అమ్మఒడి, విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పేదలందరికీ ఇళ్లు..వంటి సంక్షేమ పథకాల అమలులో లబ్దిదారుడు ఏ పార్టీ అనేది చూడట్లేదు.

టీడీపీ నేతకు..
తాజాగా ఇది మరోసారి రుజువైంది. వైఎస్ జగన్ ఇటీవలే ప్రారంభించిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బొడ్రోతు శ్రీనివాసరావు కుమార్తె శైలజకు 84 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. విజయనగరం జిల్లా వంగర మండలానికి చెందిన టీడీపీ నాయకుడాయన. చాలాకాలంగా ఆయన టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తోన్నారు.
తొలి విడతలో..
ఆయన కుమార్తె శైలజ ప్రస్తుతం వాషింగ్టన్ లోని యూనివర్శిటీలో చదువుకుంటోన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఆమె ఎంపికయ్యారు. తొలి విడతగా ఆమె ఖాతాలో 13,99,154 రూపాయల ప్రభుత్వం జమ చేసింది. శైలజ రెండు సంవత్సరాల చదువుకు అయ్యే 84 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.

థ్యాంక్స్ టూ సీఎం..
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయం అందడం పట్ల శ్రీనివాసరావు కుమార్తె శైలజ ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం గురించి న్యూస్ లో చూసి దరఖాస్తు చేసుకున్నానని, ప్రపంచంలోనే టాప్ వంద యూనివర్సిటీల్లో ఒకటైన వాషింగ్టన్ లో సీటు పొందానని అన్నారు. తన విద్యకు అయ్యే ఖర్చు మొత్తాన్నీ ప్రభుత్వమే భరించడానికి ముందుకు రావడం పట్ల ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.
తండ్రి భావోద్వేగం..
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో తన కుమార్తెను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని శైలజ తండ్రి శ్రీనివాసరావు అన్నారు. జనం కోసం నిరంతరం పని చేసే వ్యక్తిగా అభివర్ణించారు. తన కూతురు హైద్రాబాద్ లో ఐఐటీ చదివిందని, ఇప్పుడు జగనన్న విదేశీ విద్యా దీవెనతో మంచి యూనివర్సీటీలో సీటు సంపాదించిందని చెప్పారు. భవిష్యత్తులో తన కూతురు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.

జగనన్న విదేశీ విద్యాదీవెన ప్రయోజనాలు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య కోర్సులు చదివడానికి ఆర్థికసాయం చేయడానికి ఉద్దేశించిన పథకం.. జగనన్న విదేశీ విద్యా దీవెన. ఈ పథకం ద్వారా.. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో టాప్ 200 జాబితాలో ఉన్న యూనివర్సిటీల్లో.. ఎంబీబీఎస్, పీజీ, పీహెచ్డీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తుంది.

టాప్ 100లో ఉంటే..
క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-100 జాబితాలో ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే వంద శాతం ట్యూషన్ ఫీజును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. విదేశీ విద్యా దీవెన పథకం కింద- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 శాతం ట్యూషన్ ఫీజులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 1.25 కోట్ల రూపాయల వరకు, టాప్ 100 విశ్వవిద్యాలయాలలో ర్యాంకులు సాధించిన ఈబీసీ విద్యార్థులకు ఒక కోటి రూపాయల వరకు రీయింబర్స్మెంట్ చేస్తుంది.

101 నుంచి 200 లోపు ఉంటే..
క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం 101 నుంచి 200 లోపు జాబితాలో ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే.. ట్యూషన్ ఫీజు మొత్తంలో యాభై శాతం లేదా 50 లక్షలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఆర్థిక సహాయం, విమాన ఛార్జీలు, వీసా ఫీజు వంటి అంశాలకు రీయింబర్స్మెంట్ రూపంలో అందుతాయి.

నిధుల విడుదల ఇలా..
విద్యార్థుల ఇమ్మిగ్రేషన్ కార్డుల (ఐ-94) రశీదు ప్రకారం- మొదటి విడత నిధులను చెల్లిస్తుంది ప్రభుత్వం. మొదటి సెమిస్టర్ ఫలితాలు వెలువడిన తరువాత రెండో విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తుంది. సెకండ్, థర్డ్ సెమిస్టర్లు పూర్తయిన అనంతరం మూడో విడతలో నిధులు విద్యార్థుల ఖాతాలో జమ చేస్తుంది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థిక సహాయాన్ని పొందాలనుకున్న విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలకు మించకూడదు.












Click it and Unblock the Notifications