లోకసభ ఎన్నికలు 2019: వరంగల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలలో వరంగల్ ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నూతన పునర్విభజన ప్రకారం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. వరంగల్ లోక్సభ నుంచి మొదటి లోకసభకు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్) అభ్యర్థి గెలిచారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి గెలిచింది. 1957 నుంచి 1980 వరకు కాంగ్రెస్ లేదా కాంగ్రెస్(ఐ) గెలిచింది.
1984లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ రెండుసార్లు 1989, 1991లలో కాంగ్రెస్ గెలవగా, 1996, 1998, 1999 లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ, 2009లో కాంగ్రెస్, 2014 సార్వత్రిక ఎన్నికల్లో, 2015 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది.
వరంగల్ లోక్సభకు మొదటి లోక్సభకు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున పెండ్యాల రాఘవ రావు ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత సాదత్ అలీ ఖాన్, బకర్ అలీ మీర్జా, సురేందర్ రెడ్డి (ఈ ముగ్గురు కాంగ్రెస్), ఎస్బి గిరి (తెలంగాణ ప్రజా ఫ్రంట్), మల్లిఖార్జున రావు (కాంగ్రెస్), కమాలుద్దీన్ అహ్మద్ (కాంగ్రెస్ ఐ), కల్పనాదేవి (టీడీపీ), సురేందర్ రెడ్డి రెండుసార్లు వరుసగా (కాంగ్రెస్) గెలిచారు. 1996, 1998లలో అజ్మీరా చందూలాల్ (టీడీపీ), ఆ తర్వాత బోడకుంటి వెంకటేశ్వర్లు (టీడీపీ) గెలిచారు. 2004లో ధరావత్ రవీంద్ర నాయక్ (టీఆర్ఎస్), 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర రావు (టీఆర్ఎస్) గెలిచారు. 2009లో సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెస్) గెలిచారు. ఆ తర్వాత తెరాస నుంచి కడియం శ్రీహరి పోటీ చేసి గెలిచారు. ఆయన ఎమ్మెల్సీ అయి తెలంగాణలో మంత్రి అయ్యారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పసునూరి దయాకర్ (తెరాస) గెలిచారు.
2015 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్కు 6,15,403 ఓట్లు వచ్చాయి. దాదాపు అరవై శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,56,315 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దేవయ్యకు 1,29,868 ఓట్ల వచ్చాయి. పసునూరి దయాకర్ 4,59,088 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
అంతకుముందు, సార్వత్రిక ఎన్నికల్లో కడియం శ్రీహరి (టీఆర్ఎస్) గెలిచారు. శ్రీహరికి 6,61,639 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు 2,69,065 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పరమేశ్వర్కు 1,87,139 ఓట్లు వచ్చాయి. 2014లో కడియం శ్రీహరి 3,92,574 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో 15,37,781 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,71,756 మంది పురుష ఓటర్లు, 7,66,025 మహిళా ఓటర్లు ఉన్నారు. 2014లో 11,74,631 మంది ఓట్లు వేశారు. 76 శాతం ఓటింగ్ నమోదయింది. పురుషులు 5 లక్షల 92వేలకు పైగా, మహిళలు 5,82వేలకు పైగా ఓట్లు వేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో 21 లక్షలకు పైగా జనాభా ఉంది. గ్రామీణ ప్రాంతంలో దాదాపు అరవై శాతం, పట్టణ ప్రాంతంలో 40 శాతంగా ఉంది.
వరంగల్ లోక్సభ ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్ వృత్తిరీత్యా వ్యాపారవేత్త. గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. లోక్సభలో ఐదు ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో తెలంగాణ యావరేజ్ 187, నేషనల్ యావరేజ్ 183గా ఉంది. సభకు 52 శాతం ఉత్తీర్ణత ఉంది. ఇందులో తెలంగాణ యావరేజ్ 69శాతంగా ఉంది. చర్చల్లో పాల్గొనలేదు. చర్చల్లో తెలంగాణ యావరేజ్ 22 శాతంగా ఉండగా, జాతీయ యావరేజ్ 43.9గా ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి రూ.16.34 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. తెలంగాణ నుంచి ప్రయివేటు బిల్స్ యావరేజ్గా రెండు ఉన్నాయి. జాతీయస్థాయిలో 1.4 శాతంగా ఉంది.
వరంగల్ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. స్టేషన్ ఘనపూర్ (ఎస్సీ రిజర్వ్), పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట (ఎస్సీ), భూపాలపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి.
స్టేషన్ ఘనపూర్ నుంచి రాజయ్య (టీఆర్ఎస్), పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర రావు (టీఆర్ఎస్), పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి (టీఆర్ఎస్), వరంగల్ వెస్ట్ నుంచి దాస్యం వినయభాస్కర్ (టీఆర్ఎస్), వరంగల్ ఈస్ట్ నుంచి నరేంద్ర నన్నెపునేని (టీఆర్ఎస్), వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్ (టీఆర్ఎస్), భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణా రెడ్డి (కాంగ్రెస్) గెలిచారు.