లండన్లో జయశంకర్ కేంద్రం
లండన్: జయశంకర్ తెలంగాణ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని (జెటిఆర్డిసి) లండన్లోని హౌన్స్లోలో తెలంగాణ ఉద్యమ నేత వి. ప్రకాష్, ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్ ఈ నెల 27వ తేదీన ప్రారంభించారు. ఈ కేంద్రానికి వి. ప్రకాష్ గ్లోబల్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఈ కేంద్రాన్ని సృజన్ రెడ్డి చాడ రిజిష్టర్ చేయించారు. ఈ కేంద్రం జయశంకర్ 79వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జయశంకర్కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఫోన్లో మాట్లాడారు. జయశంకర్తో తనకు గల అనుబంధాన్ని, తెలంగాణ కోసం జయశంకర్ చేసిన నిరంతర కృషిని గుర్తు చేశారు. డాక్టర్ నిశాంత్ దొంగరి కేంద్రం లక్ష్యాలను, కార్యాచరణను వివరించారు. జెటిఆర్డిసి అకడమిక్ సంస్థ అని, తెలంగాణ అభివృద్ధి కోసం అది పనిచేస్తుందని, గ్రామీణ స్థాయి నుంచి తెలంగాణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశలో అభివృద్ధికి పనిచేస్తుందని వి. ప్రకాష్ చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు తరాల కోసం ఈ కేంద్రం విజన్ డాక్యుమెంట్ను, బ్లూ ప్రింట్లను రూపొందిస్తుందని చెప్పారు. ఇందుకు ప్రముఖుల సహకారంతో పాటు ప్రభుత్వ, ఎన్జీవోల సహకారం కూడా తీసుకుంటుందని చెప్పారు.
స్థానిక తెలంగాణ కార్యకర్తల నుంచి సమాచారం తీసుకుని సమస్యలను గర్తించి, అధ్యయనం చేస్తామని ప్రకాష్ చెప్పారు. నిపుణుల కమిటీల సలహాలతో సమస్యలకు పరిష్కారం కనుక్కుంటామని ఆయన చెప్పారు. కేంద్రం పాత్ర, బాధ్యతలపై మధు అందెం, శశి జలిగామ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రకాష్, రసమయి బాలకిషన్లకు సన్మానం జరిగింది.
టిడిఎఫ్కు చెందిన కమల్, తెరాస ఎన్నారై విభాగం నుంచి అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారై ఫోరం నుంచి గంప వేణుగోపాల్, ప్రవాసి భారత్ నుంచి నాగేందర్ చిందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.