తానా ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు: పోటీలో ఉద్ధండులు, పోటీపై ఆసక్తి
అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటితో ముగిసింది.
వాషింగ్టన్: అత్యంత ప్రతిష్టాత్మకమైన 'తానా'(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటితో ముగిసింది. అన్ని పదవులకూ రెండు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. అధ్యక్ష పదవికి మిచిగాన్లో నివసించే శ్రీనివాస గోగినేని, వర్జీనియాలో ఉండే నరేన్ కొడాలి లాంటి ఉద్ధండులు పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికలపై ఆసక్తి మరింత పెరిగింది.
నాలుగు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, 29 ఎగ్జిక్యూటివ్ కమిటీ, 7 తానా ఫౌండేషన్ ట్రస్టీ.. ఇలా మొత్తం 40 పదవులు బలీయమైన ఈ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. రెండు వర్గాలూ అమెరికాలోని 50 రాష్ట్రాల్లోని తానా సభ్యులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో నిలిపాయి. అధ్యక్ష అభ్యర్థుల ప్యానెళ్లకు అనుభవం కలిగిన మహిళలు, యువతతో కూడిన టీమ్స్ సమకూరడంతో ఎన్నికల సరళి, ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తికరంగా మారాయి.

అధ్యక్ష పదవికి తానా సీనియర్ నాయకుడు శ్రీనివాస గోగినేని పోటీ పడుతున్నారు. గతంలో తానా ఫౌండేషన్ ఛైర్మన్గా అనేక కార్యక్రమాలను నిర్వహించిన గుర్తింపు ఆయనకు ఉంది. 2015లో డెట్రాయిట్ తానా కాన్ఫరెన్స్కు సెక్రటరీగానూ గోగినేని పనిచేశారు. దీని కారణంగా ఎంతోమందితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగి ఉన్నారు. మంచి సంస్కరణలు తెచ్చారనే గర్తింపు ఉంది.
గతంలో రెండు సార్లు తానా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి ఆయనకు బలమైన వర్గం దన్ను, పూర్తి ప్యానెల్ తో ముందుకు రావడంతో ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. శ్రీనివాస గోగినేని ప్యానెల్ టీంకు తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, మాజీ అధ్యక్షుడు జయ్ తాళ్లూరితోపాటు పలువురు పెద్దలు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.

ఇక మరోవైపు, తానాలో మరో సీనియర్ నాయకుడిగా ఉన్న నరేన్ కొడాలి కూడా అధ్యక్షుడిగా బరిలో ఉన్నారు. గతంలో బోర్డు ఛైర్మన్గానూ విజయవంతంగా పనిచేశారు. అంతేగాక, 2019 వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ కు ఆయన ఛైర్మన్గా సేవలందించారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్ కావడంతో గత ఎన్నికల్లో పూర్తి ప్యానెల్ తో గట్టి పోటీ ఇచ్చారు.
దీంతో వచ్చిన గుర్తింపుతో ఈయనకు కూడా చాలా మందితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. గత ఎన్నికలు పూర్తయినప్పటి నుంచే తిరిగి బరిలో ఉండేందుకు కసరత్తులు చేస్తున్నారు. నరేన్ ప్యానెల్ టీంకు తానా ప్రస్తుత అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షులు గంగాధర్ నాదెళ్ల, సతీష్ వేమనతోపాటు మరికొంతమంది మద్దతు ఉన్నట్లు తెలిసింది. అయితే, ఎన్నికలు ఏకగ్రీవానికి ప్రయత్నాలు సాగినప్పటికీ.. అవన్నీ విఫలమయ్యాయి. దీంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications