భారత రక్షణ రంగంలో సంచలనం.. ప్రైవేట్ చేతుల్లోకి మిస్సైల్ టెక్నాలజీ!
భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయ ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడానికి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన ఈ అత్యంత అధునాత టెక్నాలజీ ఇకపై భారతీయ ప్రైవేట్ పరిశ్రమలకు కూడా లభించనుంది. దీనివల్ల దేశంలోనే అత్యంత వేగంగా, భారీ స్థాయిలో మిస్సైల్స్ ఉత్పత్తి చేయడం సాధ్యం అవుతుంది.
రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ కల నెరవేర్చడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. గతంలో భారత్ తన సైనిక అవసరాల కోసం ముఖ్యంగా అధునాతన ఆయుధ వ్యవస్థల కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడేది. కానీ ఈ టెక్నాలజీని బదిలీ చేయడం ద్వారా భారతీయ కంపెనీలే స్వయంగా క్షిపణులను తయారు చేసుకోగలవు. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా.. యుద్ధం లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు బయటి దేశాల సరఫరాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. మిస్సైల్స్ కొరత లేకుండా చూసుకోవచ్చు.

ఈ నూతన విధానంతో రక్షణ రంగంలో భారీ మార్పులు రానున్నాయి. డీఆర్డీవో కేవలం మిస్సైల్ అభివృద్ధిపై దృష్టిసారిస్తే.. ప్రైవేట్ పరిశ్రమలు వాటి భారీ ఉత్పత్తి బాధ్యతను తీసుకుంటాయి. ఈ సప్లై చైన్ లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్స్ కూడా భాగస్వాములు కావడం ద్వారా దేశంలో విస్తారంగా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే సాంకేతికతను పొందే కంపెనీలు కఠినమైన భద్రతా ప్రమాణాలు, అర్హతలు, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తానికి రక్షణ మంత్రి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం భారత రక్షణ రంగాన్ని మరింత పారదర్శకంగా, పోటీతత్వంతో కూడినదిగా మారుస్తుంది. దేశీయ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా భవిష్యత్తులో భారత్ ఇతర మిత్రదేశాలకు మిస్సైల్ టెక్నాలజీని, ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడానికి ఇది ఓ బలమైన పునాది కానుంది.














Click it and Unblock the Notifications