విజయవాడలో నివసిస్తున్నా: భారత్పై నెదర్లాండ్స్ గెలవాలనే కోరుకుంటా: క్రికెటర్ తేజ నిడమానూరు తల్లి పద్మ
హైదరాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2023 రసవత్తరంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ విజయఢంకా మోగించింది. ఇంగ్లాండ్ను చిత్తు చిత్తు చేసింది. ఆ జట్టు నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరు బ్లాక్ క్యాప్స్ కొట్టి అవతల పడేశారు. 36.2 ఓవర్లలోనే భారీ టార్గెట్ను ఛేదించారు. ఓపెనర్ డెవాన్ కాన్వే- 152, టాప్ ఆర్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర- 123 పరుగులతో నాటౌట్గా నిలిచారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 286 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్, సవూద్ షకీల్ హాఫ్ సెంచరీతో చెలరేగారు. 68 చొప్పున పరుగులు సాధించారు. మహ్మద్ నవాజ్- 39, షాదబ్ ఖాన్ 32 పరుగులతో రాణించారు.

మిగిలిన బ్యాటర్లెవరూ ఈ స్థాయిలో సత్తా చాటలేకపోయారు. కేప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి ఘోరంగా విఫలం అయ్యాడు. అయిదు పరుగులకే పెవిలియన్ చేరాడు. నెదర్లాండ్స్ జట్టులో బాస్ డె లీడె నాలుగు వికెట్లు పడగొట్టాడు. 9 ఓవర్లల్లో 62 పరుగులు ఇచ్చిన లీడె.. మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తిక్ అహ్మద్, షాదబ్ ఖాన్, హసన్ అలీని వెనక్కి పంపించాడు. కొలిన్ అక్కెర్మన్-2 వికెట్లు కూల్చాడు. ఆర్యన్ దత్, లొగాన్ వాన్ బీక్, పాల్ వాన్ మీకెరెన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు తడబడుతోంది. 29 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్, టాప్ ఆర్డర్ బ్యాటర్ కొలిన్ అకెర్మన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. విక్రమ్ జీత్ సింగ్- 52, బాస్ డి లీడె- 57 పరుగులు చేశారు. బస్ డీ లీడె-57, సకిబ్ జుల్ఫికర్- 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.

విజయవాడ కుర్రాడు తేజా నిడమానూరు ఈ మ్యాచ్లో విఫలం అయ్యాడు. అయిదు పరుగులే చేశాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో ఫకర్ జమాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రవూఫ్ సంధించిన సీమర్ను భారీ షాట్ ఆడబోయాడు తేజా. టైమింగ్ మిస్ అయ్యాు. డీప్ మిడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని ఫకర్ జమాన్ అందుకున్నాడు.
కాగా- ఈ మ్యాచ్ను చూడటానికి తేజా నిడమానూరు తల్లి పద్మ, అమ్మమ్మ, పిన్ని, చెల్లెలు, ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. వారితో వన్ ఇండియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవినాష్ శర్మతో మాట్లాడారు. తేజా చిన్నప్పడు ఎలా ఉండేవాడు?, క్రికెట్పై అతనికి ఉన్న ప్యాషన్ గురించి పద్మ వివరించారు.
నేను విజయవాడలో ఉంటున్నాను. మ్యాచ్ చూడటానికి ఇక్కడికి వచ్చాను. తేజకు న్యూజిలాండ్ పౌరసత్వం ఉంది. నాకు ఆ దేశ పౌరసత్వం లభించలేదు. అందుకే అప్పుడప్పుడూ న్యూజిలాండ్కు వెళ్లి వస్తుంటాను. క్రికెట్ అంటే నా కుమారుడికి చాలా ప్యాషన్.. అని పద్మ తెలిపారు.
భారత్- నెదర్లాండ్స్ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా నాకు సంతోషమే. కొడుకు ఆడుతున్నందున నెదర్లాండ్స్ గెలిస్తే ఆ సంతోషం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు మీడియాతో ఎప్పుడూ మాట్లాడలేదు. తొలిసారిగా మీతో (వన్ ఇండియా) మాట్లాడుతున్నాను. తేజా నిడమానూరు తల్లిగా గర్వ పడుతున్నాను.. అని పద్మ చెప్పారు.

ఇదివరకు న్యూజిలాండ్, వెల్లింగ్టన్ క్లబ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లల్లో మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు నెదర్లాండ్స్ జాతీయ జట్టులో చోటు సాధించాడు. న్యూజిలాండ్ తరఫున అండర్ 19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. నెదర్లాండ్స్ తరఫున ఆడటానికి ఆ దేశానికి వెళ్లాడు. తేజ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. అని పద్మ తెలిపారు.












Click it and Unblock the Notifications