అదేం బ్యాటింగ్ రా బై- బోల్తా కొట్టిన టీమిండియా
IND vs NZ: భారత్పై బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించిన న్యూజిలాండ్ ఇప్పుడు కదనోత్సాహంలో ఉంది. రెండో టెస్ట్లోనూ విజయఢంకా మోగించడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరగ్గొట్టింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తిరుగులేని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ను మట్టికరిపించింది. టీమిండియా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని కొట్టి పడేసింది. 36 సంవత్సరాల తరువాత భారత్లో భారత్పై టెస్ట్ మ్యాచ్ గెలవడం న్యూజిలాండ్కు ఇదే తొలిసారి.

ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్లోనూ అదే తరహా రిజల్ట్ రాదనే గ్యారంటీ లేకుండా పోయింది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగారు. టీమిండియా బ్యాటర్ల భరతం పట్టారు. కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు.
రెండో రోజు తొలి సెషన్లోనే వరుసగా వికెట్లు పడ్డాయి. భోజన విరామ సమయానికి ఏకంగా ఏడు వికెట్లు కుప్పకూలాయి. 107 పరుగులకే టాప్, మిడిలార్డర్ బ్యాటర్లందరూ చాప చుట్టేశారు. పెవిలియన్లో వచ్చి కూర్చున్నారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు.

తొలి రోజు చివరి గంటలోనే భారత జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయిన విషయం తెలిసిందే. రెండో రోజూ వికెట్ల పతనానికి ఎక్కడే గానీ బ్రేకులు పడలేదు. జట్టు స్కోరు 50 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. శుభ్మన్ గిల్- 30 పరుగులు చేసి మిఛెల్ శాంట్నర్ బౌలింగ్లో ఎల్బీగా అవుట్ అయ్యాడు.
అది మొదలు వికెట్లు టపటపమంటూ రాలిపోయాయి. యశస్వి జైస్వాల్- 30, విరాట్ కోహ్లీ- 1, రిషభ్ పంత్- 18, సర్ఫరాజ్ ఖాన్- 11, రవిచంద్రన్ అశ్విన్- 4 పరుగులు చేసి వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్లల్లో శాంట్నర్ చెలరేగాడు. స్పిన్ మాయాజాలంతో కట్టిపడేశాడు. నాలుగు వికెట్లు నేల కూల్చాడు. గ్లెన్ ఫిలిప్స్- 2, టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.












Click it and Unblock the Notifications