ప్రజారాజ్యానికి పెద్ద దెబ్బ?
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ఈ మధ్య సందడి తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు మాత్రమే పార్టీ ముఖ్యులు అక్కడ కనిపిస్తున్నారు. మామూలు కార్యకర్తలకు ఆ కార్యాలయంలో ప్రవేశించడం గగనమైపోతోంది. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని సీనియర్ నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎంతో ప్రచారంతో ఆ పార్టీలో చిరంజీవి సమక్షంలో చేరిన గౌతు లచ్చన్న కుమార్తె నిన్న ఆ పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రోడ్ షోలపై హైకోర్టు స్టే విధించినప్పటి నుంచి చిరంజీవిలో ఉత్సాహం తగ్గిపోయినట్టు కన్పిస్తోంది. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ప్రతి రోజూ విలేకరుల సమావేశం నిర్వహించిన చిరంజీవి ఇప్పుడు వాటి మీద కూడా అంత ఆసక్తి చూపుతున్నట్టు లేదు. అయితే ఇది తాత్కాలికమేనని, రోడ్ షోల మీద హైకోర్టు స్టే తొలగించిన తర్వాత మళ్ళీ చిరు ప్రభంజనం ప్రారంభమవుతుందని కొందరు ప్రజారాజ్యం నాయకులు చెబుతున్నారు. ఒక వేళ రోడ్ షోలను పూర్తిగా నిషేధిస్తే ప్రజలను కలుసుకునే ప్రత్యామ్నాయ మార్గాలు తమ వద్ద ఉన్నాయని వారు అంటున్నారు.
వామపక్షాలు తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం, టీఅర్ ఎస్ కూడా ఆ కూటమి వైపు మొగ్గు చూపడం ప్రజారాజ్యం పార్టీ నైరాశ్యానికి ప్రధాన కారణం. ఇప్పుడు కనీసం బహుజన్ సమాజ్ పార్టీతో నైనా జతకడదామని ప్రజారాజ్యం మేధావులు ఆలోచిస్తున్నారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలం బహు స్వల్పం. గతంలో మాయావతి స్నేహ హస్తం చాచినా చిరంజీవి స్పందించలేదు. సిద్ధాంతబలం లేకుండా, కేడర్ దన్ను లేకుండా కేవలం ఒక వ్యక్తి చరిష్మాతో ముందుకు సాగుతున్న ప్రజారాజ్యం పార్టీకి ఇటువంటి ఎదురుదెబ్బలు తగలడం సహజమే.