చిరంజీవి స్థానంలో మూడో వ్యక్తి?

ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలో చాలా చోట్ల అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు వెళుతున్నాయి. అందుకు విరుద్ధంగా కాంగ్రెసు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక పైనే తర్జన భర్జన పడుతోంది. తిరుపతి నుండి మంత్రి గల్లా అరుణ కుమారి తన తనయుడు గల్లా జయదేవ్ను రంగంలోకి దింపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆమె గతంలో ఢిల్లీ వెళ్లి ముఖ్య నేతల వద్ద దానిని ప్రస్తావించారు.
పలుమార్లు మీడియా సమావేశం, పార్టీ సమావేశాలలోనూ ఆమె తన తనయుడికి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. జయదేవ్కు టిక్కెట్ ఇస్తే తప్పకుండా గెలిపించుకుంటానని చెప్పారు. అయితే అదే సమయంలో జయదేవ్కు టిక్కెట్ రాకుండా మరో అభ్యర్థికి ఇచ్చిన వారి విజయానికి కృషి చేస్తామని చెప్పారు. అయితే తన తనయుడి కోసం మాత్రం ఆమె తీవ్రంగా పట్టుబడుతున్నారు.
మరోవైపు వెంకట రమణ కూడా తిరుపతి టిక్కెట్ కోసం పోటా పోటీగా ఉన్నారు. తిరుపతి గెలిచే స్థానం కావడంతో ఎలాగైనా ఆ టిక్కెట్ కావాలని ఆయన పార్టీ పెద్దల వద్ద డిమాండ్ చేస్తున్నారట. కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సర్వేలో కూడా జయదేవ్ కంటే వెంకట రమణకు టిక్కెట్ ఇస్తేనే గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలిందట. దీంతో పార్టీ కూడా ఆయన వైపు మొగ్గు చూపిస్తుందని అంటున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెంకట రమణ వైపు మొగ్గు చూపుతున్నారట. కానీ గల్లా అరుణ కుమారి ఇతర వ్యక్తులకు టిక్కెట్ ఇచ్చినా గెలిపిస్తానని పైకి చెబుతున్నప్పటికీ.. జయదేవ్కు ఇవ్వకుంటే సహకరించే అవకాశాలు తక్కువ ఉన్నాయని అంటున్నారు. దీంతో టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక పోతున్నారు. అయితే ఇరువురి పోటీ కారణంగా మూడో వ్యక్తికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలను పార్టీ ఆలోచిస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications