జగన్తో ఒప్పందం: కెసిఆర్ మైండ్గేమ్?
ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ అవిశ్వాస తీర్మానం అని ప్రకటించడం వెనుక.. ఆ పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ఉండవచ్చుననే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు ఇబ్బందుల్లో ఉన్న అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఇప్పుడిప్పుడే క్రమంగా పుంజుకుంటున్నాయి. అవి పూర్తిగా పుంజుకునేలోపే ఎన్నికలు రావాలని తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కోరుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన విభేదాలను పక్కన పెట్టి ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని పడగొట్టి లబ్ధి పొందాలని భావించి ఉంటాయని అంటున్నారు. సీమాంధ్రలో సత్తా చాటిన జగన్ తెలంగాణలోకి అడుగుపెట్టడం తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య చిచ్చు రేపిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తమ తమ రాజకీయ లబ్ధి కోసం వారిద్దరు ఒక్కటయి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
టిడిపి, కాంగ్రెసును ఇరుకున పెట్టేందుకు జగన్, కెసిఆర్ కలిసి ఆడుతున్న మైండ్ గేమ్ కూడా కావొచ్చునని అనుమానిస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరో అభ్యర్థిని పోటీ పెడుతున్నామని కాంగ్రెస్ చివరి నిమిషం దాకా మైండ్ గేమ్ ఆడింది. ఆ పార్టీ ఆరో అభ్యర్థిని పెడితే ఇబ్బంది తెరాసకే. ఆ పార్టీని ఒత్తిడికి గురి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆరో అభ్యర్థిని ప్రచారంలోకి తెచ్చింది. అది అయిపోయిన తర్వాత అదే గేమ్ను కెసిఆర్ అందుకోవడం గమనార్హం.
అవిశ్వాస తీర్మానంపై నిజంగా సీరియస్గా ఉంటే ముందే అన్ని ప్రతిపక్ష పార్టీలతో చర్చించాలనే వాదన వినిపిస్తోంది. ముందు ప్రకటన చేసి చర్చలు జరపరని, ఈ వ్యవహారం చూస్తుంటే ఇది మైండ్ గేమ్లాగే కనిపిస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన ఆమోదం పొందడానికి ముప్పై మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు లేదా టిడిపి మద్దతు ఇచ్చినప్పుడే అది ఆమోదం పొందగలుగుతుంది.
ఈ నేపథ్యంలో తెరాస, వైయస్సార్ కాంగ్రెసులు లోపాయికారీ ఒప్పందానికి వచ్చి ఉంటాయని.. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం పెడతామని తెరాస ప్రకటించి ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాసం నోటీసు ఇస్తే మద్దతు ఇవ్వడానికి మిగిలిన పార్టీలు ముందుకు వచ్చే అవకాశం లేదని, అందువల్ల తెరాసను ముందు పెట్టి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అవిశ్వాసం పెడితే ఎవరి రంగు ఏమిటో తెలిసిపోతుందని కెసిఆర్ అన్నప్పటికీ దీనికి మద్దతు ఇవ్వడానికి టిడిపి సుముఖంగా లేదని చెబుతున్నారు. ఈ అవిశ్వాసం గురించి టిఆర్ఎస్ ఇంతవరకూ తమ పార్టీతో మాట్లాడలేదని, ముందు ప్రకటించి తర్వాత మాతో మాట్లాడితే మద్దతు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని, పైగా మా సంఖ్యాబలంతో పోలిస్తే అది చాలా చిన్న పార్టీ అని, ఆ పార్టీ తీర్మానం పెడితే తాము ఎలా మద్దతిస్తామని, మేం సొంతంగా తీర్మానం ఇవ్వడమో, తటస్థంగా ఉండటమో చేయాల్సి ఉంటుందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.