బాబుకు మోత్కుపల్లి ఝలక్ ఇస్తారా?
ఇప్పటి వరకు బాబు పర్యటించిన ప్రతి జిల్లాల్లో చిన్న చిన్న విభేదాలు మినహా ఆయా జిల్లాలకు చెందిన పార్టీ నేతలు సమన్వయంతో పని చేసుకుపోయారు. నల్గొండ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మోత్కుపల్లి గత కొంతకాలంగా పార్టీ అధినేత పైన అలక వహించారు. అఖిల పక్ష సమావేశానికి ముందు కరీంనగర్లో జరిగిన పార్టీ భేటీకి తనకు ఆహ్వానం అందక పోవడం, ఆల్ పార్టీకి తనను పంపించక పోవడం, జిల్లాలో పలు పదవుల విషయంలో తన మాట నెగ్గగ పోవడంతో మోత్కుపల్లి చిన్నబుచ్చుకున్నారట.
దీంతో ఎప్పుడూ మీడియా ముందు కనిపించే మోత్కుపల్లి కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఇటీవల పార్టీ కార్యక్రమాలలో ఆయన కనిపించింది లేదు. ఇప్పుడు బాబు పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోత్కుపల్లి గైర్హాజరైతే జిల్లా టిడిపి క్యాడర్లో అసంతృప్తి అలుముకుంటోందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. మోత్కుపల్లి అలక చూస్తుంటే బాబు పాదయాత్రలో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.
బాబు పాదయాత్ర నల్గొండలో ఒక్క కోదాడలోనే కొనసాగనుంది. ఆ ఒక్క నియోజకవర్గంలో ఐదు రోజులు పాదయాత్ర ఉంటుంది. కోదాడ ఎమ్మెల్యే చందర రావుకు మోత్కుపల్లికి విభేదాలు ఉన్నాయి. ఎలా చూసినా మోత్కుపల్లి బాబు పాదయాత్రలో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. విభేదాలు ఎన్ని పార్టీ అధినేత కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండటం సరికాదని అంటున్నారు. నల్గొండ నుండి బాబు యాత్ర కృష్ణా జిల్లాలోకి ఈ నెల 21వ తేదిన ప్రవేశిస్తుంది.