సాధ్యం కాదు: రామాలయంపై బీజేపీ కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఎన్డీయే ప్రభుత్వానికి మెజార్టీ లేనందున అయోధ్యలో రామమందిర నిర్మాణం చట్టాన్ని తీసుకు రాలేమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం చెప్పారు. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) ఆధిక్యం లేదని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో రామాలయం నిర్మాణానికి సంబంధించిన చట్టం ప్రస్తుతం పార్లమెంటులో ఆమోదం పొందే పరిస్థితి లేదని చెప్పారు. ఆదివారం అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత నృత్య గోపాల్ దాస్ నిర్వహించిన కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులు రామాలయంపై ప్రశ్నించారు. రాజ్యసభలో పార్టీకి 45 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని చెప్పారు. మందిరం నిర్మాణం పైన తీర్మానం, చట్టం అంగీకారం పొందే అవకాశం ఏమాత్రం లేదని చెప్పారు. భవిష్యత్తులో పార్టీ సంఖ్యాబలం పెరిగితే చట్టం తీసుకు వస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. అది ఊహాజనిత ప్రశ్ని అని కొట్టిపారేశారు.
దావూద్ ఇబ్రహీం ఆచూకీ పైన ఆయన స్పందించారు. దావూద్ ఇబ్రహీం ఆచూకీ పైన కొన్ని రోజుల క్రితం కేంద్రం పార్లమెంటులో చేసిన ప్రకటనతో ఇబ్బందుల్లో పడింది. దీంతో, దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలుసునని, దీనిపై పార్లమెంటులో ప్రకటన చేస్తామని చెప్పారు.