ఆవేశమొద్దని బాబు, కేసీఆర్ని ఎండగట్టాలని వీరికి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన ఓ వైపు ఆంధ్రప్రదేశ్ మంత్రులను సముదాయిస్తూనే.. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలను ఆ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికతపై స్పష్టమైన నిర్వచనం ఉందని, విద్యా సంస్థల్లో ప్రవేశాలూ దీని ప్రాతిపదికనే జరుగుతున్నాయని, సంక్షేమపథకాలూ ఇదే స్థానికత ఆధారంగా అమలు కావాలని, స్థానికతకు తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిర్వచనం ఇచ్చుకునే అవకాశం లేదని, ప్రతి విషయంలోనూ తగాదా పెట్టుకొనేలా ఆ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, విభజన చట్టంలో చెప్పిన వాటిని కూడా పాటించడం లేదని, దీనిపై కేంద్రంతో మాట్లాడాలని కొందరు మంత్రులు బాబు ముందు గట్టిగా వాదించారు.
వారికి చంద్రబాబు సర్ది చెప్పారు. వాళ్లేదో అంటున్నారని మనం ఆవేశకావేషాలకు లోనుకావాల్సిన అవసరం లేదని, మనం పద్ధతిగా వ్యవహరిస్తున్నామని అందరూ గుర్తించేలా చేద్దామని, ఏ ప్రాంతం వారైనప్పటికీ పేద విద్యార్థులకు అన్యాయం జరగవద్దని, ఏ ప్రభుత్వానికైనా పేదలను ఆదుకోవడం మొదటి ధర్మమని, ఏ విద్యార్ధి ఏ ప్రాంతం వాడన్న చర్చలోకి వెళ్తే చాలా న్యాయ సమస్యలు వస్తాయని, తెలంగాణలో పుట్టి పెరిగిన వారికి మనం ఫీజులు ఇస్తే వాళ్లు ఆ రాష్ట్రంలో స్థానికత అర్హత కోల్పోతారన్నారు.
ఆంధ్రప్రదేశ్లోనూ వారికి స్థానికత రాదని, రెంటికీ చెడిన వారవుతారని, తెలంగాణ ప్రభుత్వం తమపై భారం పడుతోందని అనుకోకుండా మనం మధ్యేమార్గంలో వెళ్దామని, ఇరురాష్ట్రాల్లో అర్హులైన మొత్తం విద్యార్థులను గుర్తించి, వారి ఫీజుల ఖర్చులో మనం 58 శాతం భరిద్దామని, తెలంగాణ ప్రభుత్వాన్ని 42 శాతం పెట్టుకోమందామని, జనాభా ప్రాతిపదికన భారం పంచుకుందామని బాబు ప్రతిపాదించారు. ఇదే ప్రతిపాదనను రాష్ట్రపతి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాని మంత్రులు సూచించారు.
దీంతో, తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి వేర్వేరుగా లేఖలు రాయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిస్పందన చూసి తదుపరి అడుగు వేయాలనే అంచనాకు వచ్చారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర నేతలకు ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ వైఖరి గురించి విద్యార్థులకు తెలియజెప్పాలని టీఎన్ఎస్ఎఫ్ నేతలకు సూచించారు. టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు లేక్వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును కలిశారు. 1956 స్థానికత నిబంధన పెట్టడం వల్ల తెలంగాణ ప్రాంతంలోని భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని బాబు అన్నారు.