గద్దర్ క్లియర్: పవన్ కల్యాణ్తో రెడీ, కెసిఆర్తో ఇక ఢీ....
ప్రజా గాయకుడు గద్దర్ పవన్ కల్యాణ్తో కలిసి పనిచేస్తూ కెసిఆర్ను ఢీకొట్టేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఆయన మాటలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి.
హైదరాబాద్: తన రాజకీయాల విషయంలో ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్తో రాజకీయంగా ముందుకు వెళ్లడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే, ఆ విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయడం లేదు. పవన్ కల్యాణ్ను రాజకీయ పార్టీ విషయంలో కలువలేదని చెప్పారు.
అయితే, సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో తాను పవన్ కల్యాణ్ను కలిశానని, జనసేన పార్టీ పెట్టినప్పుడు మాత్రం కలువలేది చెప్పారు.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఢీకొట్టడానికి ఆయన సిద్ధమైనట్లే కనిపిస్తున్నారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్కు భార్య విమలతో కలిసి ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఆదివారం సాయంత్రం ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలను బట్టి కెసిఆర్కు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడానికి సిద్దపడినట్లు అర్థమవుతోంది.

తెలంగాణలో పరిస్థితి ఏమీ మారలేదు...
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మారలేదని గద్గర్ అన్నారు. పాలకులు మాత్రమే మారారని ఆయన అన్నారు. అభివృద్ధి అంటే గొర్రెలు, మేకలు ఇవ్వడం కాదని ఆయన అన్నారు. అభివృద్ధి కింది కులాల నుంచి పై కులాలకు జరగాలని, కానీ ఇప్పుడు పై కులాల నుంచి కింది కులాలకు జరుగుతోందని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ వల్ల చెరువులు నిండినా మొదట నీళ్లు ఎవరి పొలాలకు వెళ్తున్నాయనేది ప్రధానమని, చివరలో ఉండే మాదిగల పొలాలకు చివరగా మాత్రమే నీళ్లు వస్తున్నాయని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు రాజ్యాంగంలో ఉన్నవేనని, కింది కులాలవాళ్లు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే అభివృద్ధి జరగాలని ఆయన అన్నారు.

ఇక్కడ సాంఘిక విప్లవం రావాలి
ఓటు చుట్టూ ముళ్ల కంచె ఉందని, దాన్ని విప్పాల్సిన అవసరం ఉందని గద్దర్ అన్నారు. ఉన్నోడూ లేనోడూ అనేది మాత్రమే కాదు... ఇక్కడ కులం ఉందని, కులం పోవాలంటే సాంఘిక విప్లవం రావాలని ఆయన అన్నారు. విప్లవ పోరాటాలు జరిగాయని, దాని కొనసాగింపుగానే తాను ఓట్ల రాజకీయం గురించి ప్రకటన చేశానని అన్నారు. మార్క్స్ జ్ఞాన సిద్ధాంతమే కాదు.. భారతదేశానికి వచ్చేసరికి కుల వ్యవస్థ ఉందని, అందువల్ల ఇక్కడ అంబేడ్కర్, ఫూలేలు కూడా కావాలని అన్నారు.

భావసారూప్యత గల పార్టీలను కలపాలని...
ఇంత కాలం తాను త్యాగాలు చేసిన మావోయిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నానని, కానీ ఇప్పుడు భావసారూప్యత గల పార్టీలను ఏకం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఇప్పుడు మావోయిస్టు పార్టీ సభ్యుడిని కానని చెప్పారు. కెసిఆర్ అంబేడ్కర్కు 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తాననే ఆలోచన గురించి ప్రస్తావించినప్పుడు - అంబేడ్కర్కు శిలువ వేయడం, అంబేడ్కర్ను దేవుడ్ని చేయడం కాదని, సాంఘిక విప్లవం దిశగా అడుగులు వేయడం అవసరమని అన్నారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను అమలు చేయాలని అన్నారు.

చాలా పార్టీలను నేను కలిశా...
భావసారూప్యత ఒక్కటే సరిపోదని, ఆచరణ కూడాఉండాలని, అందుకు భావసారూప్యత గల పార్టీలను కలిపే ప్రయత్నంలో ఉన్నానని గద్దర్ చెప్పారు. సిపిఐ, సిపిఎం నాయకులను, కొంత మంది వ్యక్తులను కలిశానని ఆయన చెప్పారు.

అభివృద్ధి ఇలా జరుగుతోంది...
భౌగోళిక తెలంగాణ వచ్చిందని, భౌగోళిక తెలంగాణలో వ్యవస్థను మార్చకుంటే అలాగే ఉండిపోతుందని గద్ర్ చెప్పారు. భౌగోళిక తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని, ఉదాహరణకు తూప్రాన్ చెరువు నిండిందని, నీళ్లు తెచ్చే వరకు భౌగోళిక తెలంగాణలో అభివృద్ధి జరిగినట్లేనని, కానీ చెరువు కింద భూములు కూడా పంచాలని, మాదిగోళ్ల భూములు చివరలో ఉంటాయని, వారి భూములకు ఎండాకాలంలో ముందు నీరు అందాలని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వల్ల పేదలకు వచ్చే భూమి తగ్గుతోందని, ఆ భూమి తగ్గడం వల్ల తమకు వద్దంటున్నారని ఆయన చెప్పారు. మూడో అంతస్థులో వచ్చే డబుల్ బెడ్రూంవారికి కింద భూమి చాలా తగ్గుతోందని ఆయన చెప్పారు.

ఇప్పుడు త్యాగాల తెలంగాణ రావాలి....
భౌగోళిక తెలంగాణలో పరిస్థితి అలాగే ఉంటుందని, ఇప్పుడు రావాల్సింది త్యాగాల తెలంగాణ అని ఆయన అన్నారు. త్యాగాలు చేసినవారు ఇవాళ మౌనంగా ఉండవచ్చు కానీ నిశబ్ద విప్లవం ఉంటుందని ఆయన చెప్పారు. త్యాగాలు చేసినవాడు ఇవాళ బయట ఉన్నాడు, తెలంగాణ వద్దన్నవాళ్లు మంత్రివర్గంలో ఉన్నారని ఆయన అన్నారు. మా భూములు మాకు కావాలన్నాం గానీ కొనివ్వాలని అడగలేదని, పాలకులకు మనం ప్రత్యేకంగా సూచనలు చేయాల్సిన అవసరం లేదని, ప్రత్యామ్నాయం అవసరమని, పాలకుల విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.

ఆ రోజు బేషరతుగా మద్దతిచ్చాం...
తెలంగాణ వస్తుందో రాదో అనే భయంతో ఆ రోజు భౌగోళిక తెలంగాణ ఏర్పాటుకు బేషరతుగా మద్దతిచ్చినట్లు గద్దర్ చెప్పారు. మొన్న ఏం లేదు, నిన్న ఏం లేదు, ఇవ్వాళ్ల ఏం లేదు, రేపు ఏమీ ఉండదనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని, అందుకే ప్రత్యామ్నాయం కోసం సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నామని ఆయన చెప్పారు.

కెసిఆర్ పాలనపై గద్గర్ ఇలా...
తాము సూచనలు చేయాల్సిన అవసరం లేదని గద్దర్ చెప్పారు. సలహా కమిటీలు చాలా ఉన్నాయని, జై తెలంగాణ అననోళ్లు కూడా ఆ కమిటీల్లో ఉన్నారని, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ అన్నవాళ్లను ఉరికించి కొట్టినవాళ్లు కూడా పాలనా యంత్రాంగంలో ఉన్నారని ఆయన చెప్పారు. ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని, ఏమీ మారలేదని, సమస్యలు పరిష్కారవుతాయని అనుకున్నాం గానీ కాలేదని ఆయన చెప్పారు. పాలకులకు అన్నీ తెలుసు... తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినవాళ్లు పాలనాయంత్రాంగంలో ఉన్నారని ఆయన అన్నారు. తాము ఎవరికీ ప్రతికాలం కాదూ వ్యతిరేకం కాదని, తాము ప్రజల్లోకి వెళ్తున్నామని ఆయన చెప్పారు.

మావోయిస్టు పార్టీపై చాలా స్టాఫ్గానే....
మావోయిస్టు పార్టీపై ఆయన ఏ విధమైన విమర్సలు కూడా చేయలేదు, పైగా చాలా సానుకూలంగానే మాట్లాడారు. మావోయిస్టు పార్టీతో దూరం పెంచుకోవడం కాదు, పార్టీతో శత్రువైరుధ్యం లేదు, మిత్ర వైరుధ్యమే ఉందని ఆయన చెప్పారు. అంబేడ్కర్, ఫూలే భావజాలం కూడా అవసరం కాబట్టి దాన్ని స్వీకరించకపోవడం వల్ల తాను ఆ పార్టీలో ఉండలేకపోయానని ఆయన అన్నారు. రెండు పడవల మీద ప్రయాణం చేయడం సాధ్యం కాదని, మావోయిస్టు పార్టీ భావజాలానికి కొనసాగింపుగానే తాను పనిచేస్తున్నానని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అది తన జీవితం కొనసాగింపు కూడా అని అన్నారు.

. జీవితం చివరి దశలో ఉన్నాను...
తాను జీవితం చివరి దశలో ఉన్నానని, ఇప్పుడు తనకు కావాల్సిందేమీ లేదని గద్దర్ చెప్పారు. తన జీవితం నక్సలైట్ ఉద్యమంలో ధ్వంసమైందని, జీవితమే ధ్వంసమైందని అన్నారు. తుపాకి ఒక రూపం మాత్రమేనని, తుపాకితోనే రాజ్యాధికారం వస్తుందనుకున్నప్పుడు రాజ్యాంగ పరిధిలో పనిచేస్ ప్రజా సంఘాల అవసరం ఏమిటని ఆయన అడిగారు.

పవన్ కల్యాణ్తో కలిసి ఆ విషయంపై...
పవన్ కల్యాణ్ దక్షిణ భారత సంస్కృతి మీద తీసుకున్న వైఖరిని తాను బలపరుస్తున్నట్లు గద్దర్ చెప్పారు. ఆ విషయంపై తానూ పవన్ కల్యాణ్ మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే, జనసేన పార్టీ విషయంపై తమ మధ్య సంభాషణ జరగలేదని అన్నారు. సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ అనేదాన్ని స్థాపించామని, భావసారూప్యతకు సాంస్కృతికోద్యమం అవసరమని, ఆ పని కోసం తాను పనిచేస్తున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications