మోడీ విశేష కృషి: 14ఏళ్ల తర్వాత రేటింగ్ పెంచిన మూడీస్-‘బీఏఏ2’
భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న విస్తృత ఆర్థిక, సంస్థాగత సంస్కరణలకు మద్దతు పలుకుతూ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్’
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న విస్తృత ఆర్థిక, సంస్థాగత సంస్కరణలకు మద్దతు పలుకుతూ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ 'మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్' భారత్ సౌర్వభౌమ క్రెడిట్ రేటింగ్ను పెంచేసింది. భారత క్రెడిట్ రేటింగ్ను అత్యల్ప పెట్టుబడి స్థాయి 'బీఏఏ3' నుంచి 'బీఏఏ2'కు సవరించించింది.
14ఏళ్ల తర్వాత బీఏఏ2కి
భారత రేటింగ్ను అప్గ్రేడ్ చేయడం గత 14 ఏళ్లలో ఇదే తొలిసారి. అటల్ బిహారి వాజ్పేయి ప్రధానిగా ఉండగా 14 ఏళ్ల క్రితం మూడీస్ భారత్కు బీఏఏ3 రేటింగ్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ బీజేపీ ప్రభుత్వంలోనే ఇప్పుడు బీఏఏ2కి పెంచడం గమనార్హం. క్రెడిట్ రేటింగ్స్ దేశ ద్రవ్య, ఆర్థిక, నియంత్రణ విధానాలకు కొలమానంగా నిలుస్తాయి. మంచి రేటింగ్స్ ఉంటే ఆ దేశం, కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడులను సమీకరించగలుగుతాయి.
బలమైన వ్యవస్థగా భారత్..
అయితే మరోవైపు అధిక రుణ భారం దేశ క్రెడిట్ ప్రొఫైల్కు అవరోధంగా మారే అవకాశం ఉందని మూడీస్ హెచ్చరించింది. చాలా ముఖ్యమైన సంస్కరణలు ఇంకా డిజైన్ దశలో ఉన్నాయని పేర్కొన్న మూడీస్.. ఇప్పటివరకూ అమలు చేసిన సంస్కరణలతో భారత్లో వ్యాపార వాతావరణం, ఉత్పాదకత పెరుగుతోందని, విదేశీ, దేశీయ పెట్టుబడులు పెరుగుతాయని.. చివరకి బలమైన, స్థిరమైన అభివృద్ధి దిశగా దేశం ముందుకు వెళ్తుందని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్స్ సంస్థ పేర్కొనడం గమనార్హం. మార్చి 2018తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ 6.7గా ఉండనుందని మూడీస్ అంచనా వేసింది. మరోవైపు మూడీస్ క్రెడిట్ రేటింగ్స్తో భారత స్టాక్మార్కెట్లు కూడా భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
అప్పుడు వాజ్పేయి-ఇప్పుడు మోడీ
అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ భారత సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ను 14ఏళ్ల తర్వాత బీఏఏ3 నుంచి బీఏఏ2 స్థాయికి పెంచడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు నేతలు ట్విటర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. అటల్ బిహారి వాజ్పేయి ప్రధానిగా ఉండగా 14ఏళ్ల క్రితం మూడీస్ భారత్కు బీఏఏ3 రేటింగ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రధాని మోడీ పాలనలో ఆ రేటింగ్ను అప్గ్రేడ్ చేసిందని అన్నారు. అంతేగాక, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల ప్రతిఫలమే రేటింగ్ మెరుగుపడటానికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మోడీ కృషి వల్లే..
‘ప్రధాని మోడీ విశేషమైన కృషి, సంస్కరణల కారణంగానే మూడీస్ క్రెడిట్ రేటింగ్ పెరిగింది. వ్యాపారానికి అనుకూలమైన దేశాల్లో భారత్ ర్యాంకు మెరుగుపడటం, ప్యూ సర్వేలో మోడీకి భారీగా ప్రజాదరణ ఉందని తేలడం కూడా ఆయన కృషి ఫలితమే' అని అమిత్ షా ప్రశంసించారు.
ప్రముఖులేమన్నారంటే..
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో చేపడుతున్న సంస్కరణల కారణంగా భారత్ మరింత అభివృద్ధి చెందుతోందని గుర్తించారు. 2004 తర్వాత భారత సార్వభౌమ రేటింగ్ను మూడీస్ అప్గ్రేడ్ చేసింది. ప్రపంచమంతా సబ్కా సాథ్.. సబ్కా వికాస్ను గుర్తిస్తోంది' అని అన్నారు. ఇక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ‘స్వాగతించదగిన అభివృద్ధి ఇది. కానీ ఇది చాలా కాలం తర్వాత వచ్చింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి చారిత్రక నిర్ణయాలను తీసుకుంటున్న ప్రభుత్వానికి ఇదొక గుర్తింపు' అని అన్నారు. ‘ప్రభుత్వం దీర్ఘకాలిక సంస్కరణలు, ఆర్థిక స్థిరీకరణ దిశగా తీసుకుంటున్న నిర్ణయాలను పెట్టుబడిదారులు ఇప్పటికే గుర్తించారు. ఇప్పుడు మూడీస్ రేటింగ్ ఏజెన్సీ అధికారికంగా గుర్తించింది. దీన్ని స్వాగతిస్తున్నాం' అని ఆర్థిక సెక్రటరీ హస్ముఖ్ అథియా తెలిపారు. మూడీస్.. రేటింగ్ పెంచడం పట్ల భారత పారిశ్రామిక వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్బీఐ అధిపతి రజ్నీష్ కుమార్ కూడా మూడీస్ భారత రేటింగ్ పెంచడాన్ని ప్రశంసించారు. భారత అభివృద్ధికి ఇది సానుకూల సూచకమని అన్నారు. మోడీ ప్రభుత్వం క్రమపద్ధతిలో సంస్కరణలు తీసుకొస్తోందని కొనియాడారు.
మూడేళ్ల కృషి ఫలితం
మూడీస్ రేటింగ్ పెంచడం తమ సంస్కరణలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ వ్యాఖ్యానించారు. మూడీస్ అప్గ్రేడ్ అనంతరం కేంద్రమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడీస్ రేటింగ్ అప్గ్రేడ్ను స్వాగతించారు. అయితే, ఈ అప్గ్రేడ్ లేట్గా ఇచ్చిందన్నారు. అయినా 13సంవతర్సాల తర్వాత ఇండియాకు బీఏఏ 2 ర్యాంక్ అప్ గ్రేడ్ రావడం సంతోషాన్నిస్తోందన్నారు. జీఎస్టీ అమలును ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల అడుగుగా అందరూ గుర్తిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణలో భారతదేశం పురోగమిస్తోంది.ఇక తమ దృష్టి అంతా ఇన్ఫ్రా సంస్కరణలపై ఉండనుందన్నారు.
గత మూడేళ్లుగా నిర్మాణ రంగం కీలక రంగంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ మార్గంలో నడుస్తోందన్నారు. భారతదేశం సంస్కరణల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తున్న పలువురు ఇప్పుడు వారి అభిప్రాయాలను మార్చుకోవాలన్నారు. మూడు సంవత్సరాల్లో తాము చేపట్టిన సంస్కరణలు వేగవంతమైన పథం పెరుగుదలకు దారితీశాయన్నారు.