ఒక్కడే 300 సీట్లు, నేనూ: మోడీతో పోల్చుకున్న రేవంత్ రెడ్డి!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కడే 300 సీట్లు గెలిపించుకున్నాడని, తెలంగాణలో అలా రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్లు, కార్యకర్తలు కలిసి అలా గెలిపించుకోలేరని ఎందుకు అనుకుంటున్నారని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
సోమవారం ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఏదీ లేదన్నారు. తన వల్లనే సీనియర్లు నష్టపోయారని, పార్టీని విడిచి వెళ్లిపోయారని చెప్పడం సరికాదన్నారు. తాను ఎప్పుడు కూడా ఒంటెత్తు పోకడలకు పోలేదన్నారు.
కెసిఆర్ పాలన పైన నెమ్మదిగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్నారు. టిడిపి బిసిలు, బడుగు, బలహీనుల పార్టీ అన్నారు. 2019 ఎన్నికలు టిడిపి చుట్టూ తిరిగేలా చేస్తానని చెప్పారు. ఎన్నికలు, ఓట్లు, సీట్లతోనే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించలేమన్నారు.

మజ్లిస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికల్లో తమ కంటే తక్కువ ఓట్లు వచ్చాయని, అయినప్పటికీ వారు ఎక్కువ సీట్లు గెలుచుకున్నారని, కానీ ఓటింగ్ శాతం మాత్రం తమకు ఎక్కువగా ఉందన్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన పార్టీ అంతరించిపోదన్నారు.
పార్టీలో నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వచ్చే రోజులు ముందున్నాయన్నారు. టిడిపిలో తాను ఒక్కడినే లేనని, పది లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. వారితో, సీనియర్ నాయకులతో కలిసి మేం టిడిపిని 2019లో గెలిపించుకుంటామని చెప్పారు.
డీలిమిటేషన్లో తెలంగాణలో మొత్తం 153 నియోజకవర్గాలు అవుతాయన్నారు. వంద నియోజకవర్గాల్లో యువ రక్తం నింపుతామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు టిక్కెట్లు ఇస్తామన్నారు. అన్ని వర్గాలకు ఓ పార్టీ ఉందని, పేదలకు మాత్రం టిడిపి ఒక్కటే ఉందని చెప్పారు.
ఉల్లిగడ్డనే ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు ప్రజావ్యతిరేక విధానాలతో పాలిస్తున్న కెసిఆర్ ఎంత అన్నారు. 2019లో అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని, ప్రజల వద్దకు వెళ్లి కెసిఆర్ కూలబడతారన్నారు. కెసిఆర్ పాలనలో గిరిజనులపై దాడి, మాట్లాడే స్వేచ్ఛ లేదని, ప్రచార ఆర్భాటం తప్ప ఏదీ లేదన్నారు.
ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు అని అందుకే చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటుందని చెప్పారు. వంద శాతం నేను కెసిఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించుతానని చెప్పారు. నా జీవితంలో నేను పెట్టుకున్న ప్రతి లక్ష్యాన్ని చేరుకున్నానని చెప్పారు.

నేను సీఎం కావాలనుకోవడం పెద్ద గోల్ అని, కెసిఆర్ను దింపుతానని చెప్పడం చిన్న గోల్ అన్నారు. తాను చిన్న గోల్ పెట్టుకున్నానన్నారు. బలంగా ఉన్నారనుకునే సమయంలో నేతలు మునిగిన సందర్భాలున్నాయన్నారు. తెరాసలో చీలిక ఖాయమన్నారు. కెసిఆర్ బలమైన నాయకుడిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
వరంగల్లో కెసిఆర్ నిలబడ్డారని, అదే వరంగల్లో అతని పతనం ప్రారంభమవుతుందన్నారు. 14 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం పోరాడిన కార్యకర్తలను, నాయకులను విస్మరించి, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, తెలంగాణ కోసం పోరాడిన వారు చూస్తూ ఊరుకోరన్నారు.
ఓటుకు నోటు వల్లే టిడిపి ఎమ్మెల్యేలు పార్టీని వీడటం లేదన్నారు. దానికి ఎమ్మెల్యేలు పార్టీ వీడటానికి సంబంధం లేదన్నారు. తీగల కృష్ణా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు అంతకుముందే పార్టీనీ వీడారని చెప్పారు. మరి అప్పుడు ఓటుకు నోటు ఎక్కడిది అన్నారు.
తనలో ఎలాంటి అసహనం లేదన్నారు. కెసిఆర్ను సవాల్ చేసినప్పుడు ఆ స్థాయిలో మాట్లాడాలన్నారు. టిడిపికి తాను ఒక్కడినే కాదని సీనియర్లు మోత్కుపల్లి వంటి వారు ఉన్నారని, పదిలక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. టిడిపి కమ్మ పార్టీ కాదు, రెడ్ల పార్టీ కాదని, బీసీలు, బడుగుబలహీన వర్గాలు, పేదల పార్టీ అన్నారు.
నేను వెలమలకు వ్యతిరేకం కాదని, కెసిఆర్కు వ్యతిరేకమని చెప్పారు. తాను బిజెపిలోకి వెళ్లవలసిన అవసరం లేదని, టిడిపిలో సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. 2019లో కెసిఆర్ను దింపేందుకు చక్రం తిప్పడంలో, అన్ని పార్టీలను ఒకతాటిపైకి తీసుకు రావడంలో టిడిపి కీలకంగా మారుతుందన్నారు.












Click it and Unblock the Notifications