ఏపీలో రగులుతోన్న తమిళ స్పూర్తి: హోదాపై పిడికిలెత్తడానికి 'ఆర్కే బీచ్'
'మనరాష్ట్రం-మన హోదా' పేరిట మరో ఉద్యమానికి సిద్దమయ్యే కార్యాచరణను రచిస్తున్నారు.
విశాఖపట్నం: మెరీనా బీచ్ వేదికగా తమిళ యువత చేసిన జల్లికట్టు ఉద్యమానికి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ జల్లికట్టు లైన్ క్లియర్ చేయడంతో.. తమిళులు తాము అనుకున్నది సాధించారు. అయితే ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసేదాకా ఉద్యమం నుంచి పక్కకు జరిగేది లేదని తమిళ యువత తెగేసి చెబుతున్నారు.
ఇప్పుడదే స్పూర్తిని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కొనసాగించాలని భావిస్తుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చాన్నాళ్లుగా మరుగునపడిపోయిన ప్రత్యేక హోదా కాంక్షను విశాఖ ఆర్కే బీచ్ వేదికగా మరోసారి ఉధృతం చేయడానికి ఏపీ ప్రజలు సన్నద్దమవుతున్నారు. 'మనరాష్ట్రం-మన హోదా' పేరిట మరో ఉద్యమానికి సిద్దమయ్యే కార్యాచరణను రచిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే అయిన జనవరి 26న విశాఖ బీచ్ ఒడ్డున వేలాదిమంది ప్రజలతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించేందుకు ప్రతీపక్షం వైసీపీ పిలుపునిచ్చింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఏపీకి ప్రత్యేక హోదా హామిని నెరవేర్చాలన్న డిమాండ్ తో ఈ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని వైసీపీ కోరుతోంది.
సోషల్ మీడియాలోను దీనిపై విస్తృతంగా ప్రచారం జరుగుతుండగా.. భారీ ఎత్తున యువత ఈ ఉద్యమంలో పాల్గొనడానికి తరలివస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications