'సరదా కోసం మన్మోహన్ను కోర్టుకు రప్పించాలనా?'
న్యూఢిల్లీ: బొగ్గు గనుల అక్రమ కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను సరదా కోసం న్యాయస్థానానికి రప్పించాలనుకుంటున్నారా? అని సిబిఐ ప్రత్యేక కోర్టు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకొడా న్యాయవాదిని సోమవారం నాడు ప్రశ్నించింది.
జార్ఖండ్లోని బొగ్గు గనులను జిందాల్ గ్రూప్ సంస్థలైన జేఎస్పీఎల్, జీఎస్ఐపీఎల్లకు అక్రమ మార్గంలో కట్టపెట్టారని, ఇందుకు మధుకొడా, నాటి కేంద్ర సహాయమంత్రి దాసరి నారాయణ రావు, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్, బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్సీ గుప్తలు ఇతరులతో కలిసి కుట్ర పన్నారని సిబిఐ ఆరోపించింది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా మరో ఇద్దరిని కూడా ఈ కేసులో అదనపు నిందితులుగా చేర్చాలని గతంలో మధుకొడా తరఫు లాయర్ అభ్యర్థించారు. అందుకు సిబిఐ కోర్టు తిరస్కరించింది. ఆరోపణల నమోదుపై సోమవారం విచారణ జరిగింది.
ఈ సందర్భంగా మధుకోడా తరఫు న్యాయవాది అన్షుమన్ సిన్హా వాదనలు వినిపిస్తూ... బొగ్గు కేటాయింపుల్లో మధుకొడా అవినీతికి పాల్పడలేదన్నారు.

ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ భరత్ పరాశర్ కల్పించుకొని.. గత వాదనల సందర్భంగా బొగ్గు కేటాయింపుల్లో కుట్ర జరిగిందని, మన్మోహన్ సింగ్కు సమన్లు జారీ చేయాలని కోరారని, ఇప్పుడేమో ఎలాంటి కుట్ర లేదంటున్నారని, ఆయనను సరదా కోసం కోర్టుకు పిలవాలని అర్జీ పెట్టారా అని ప్రశ్నించారు.
ఇందుకు మధుకొడా లాయర్ బదులిస్తూ... సిబిఐ ఆరోపించినట్లుగా కుట్ర జరిగి ఉంటే, ఆ శాఖను చూసిన మన్మోహన్ సింగ్ను కూడా పిలవాలని, ఒక్కొక్కరికీ ఒక్కో కొలబద్దను సిబిఐ ఉపయోగించలేదని మాత్రమే తాను అన్నానని వివరించారు.












Click it and Unblock the Notifications