అదే న్యాయం: టిపై కెసిఆర్ బెట్టు చేస్తున్నారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నందువల్లే తెరాస, కాంగ్రెస్ల మధ్య అవగాహన కుదరటం లేదని ఏఐసిసి వర్గాలు అంటున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర తొలి సిఎంగా తనను నియమించేందుకు అంగీకరిస్తేనే కాంగ్రెస్లో తెరాసను విలీనం చేయటం లేదా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు అంగీకరిస్తామని కెసిఆర్ డిమాండ్ చేస్తున్నారట.
సమాచారం మేరకు... కెసిఆర్ ప్రధాన డిమాండ్ కొత్త రాష్ట్ర సిఎం పదవేనని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం తెరాస నాయకత్వంలోనే అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారని కెసిఆర్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఏఐసిసికి చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం గత పదమూడేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న తనను తొలి సిఎంగా నియమించటం పూర్తి న్యాయమని కెసిఆర్ అంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర శాసనసభ నుంచి తిరిగి రాగానే ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రతిపాదించాలని యోచిస్తోన్న హైకమాండ్, తెరాసను విలీనం చేసుకోవాలా? లేక ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలా? అనే అంశంపై సమాలోచనలు చేస్తోంది. కాంగ్రెస్కు చెందిన రాష్ట స్థ్రాయి, కేంద్రస్థాయి నేతలు తెరాస నాయకులతో తెర వెనుక చర్చలు సాగిస్తున్నారట.
రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాసలు కలిసి పోటీ చేస్తే తెలంగాణలో మెజారిటీ లోక్సభ, అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటారనే అంచనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, తెరాస విడివిడిగా పోటీ చేస్తే ఇద్దరికీ ఆశించిన సీట్లు రాకపోవచ్చంటున్నారు. తెలంగాణ కోసం తెరాస పోరాటం చేస్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత తమకు దక్కుతుందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ కొనసాగించిన విషయాన్ని మర్చిపోకూడదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, తెరాసలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఎంతో ఉందంటున్నారు. కాంగ్రెస్, తెరాసలు విడివిడిగా పోటీ చేయటం ద్వారా పరస్పర నష్టం కలిగించుకునే బదులు కలిసి పోటీ చేయటం లేదా విలీనమైన అనంతరం ఒకటిగా పోటీ చేయటం ద్వారా మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్లో విలీనమయ్యేందుకు తెరాస ముందుకురాని పక్షంలో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. తెరాసతో సీట్ల సర్దుబాటు ఒక పట్టాన తేలకపోవచ్చని కూడా కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం తర్వాతనే విలీనం, సర్దుబాటుపై మాట్లాడేందుకు కెసిఆర్ సిద్ధంగా ఉన్నారట.












Click it and Unblock the Notifications