తేల్చేస్తారా?: అమిత్ షా టీడీపీని ఎందుకు రమ్మన్నారు!, చర్చల వెనుక వ్యూహం..
అమరావతి: మొండికిపోయిన కేంద్రం ఏపీ పట్ల దిగొచ్చినట్టేనా?.. నిన్న మొన్నటిదాకా ఏపీ విషయంలో మేం చేయాల్సిందంతా చేశామని చెబుతూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు కాస్త మెత్తబడిందా?.. పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మిత్రపక్షంతో మొండి పట్టుదలకు పోవడం కంటే సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకుంటే బెటర్ అనే యోచనకు కేంద్రం వచ్చినట్టుంది.
చంద్రబాబుకు అమిత్ షా ఫోన్: విభజన హామీలపై 5న చర్చిద్దామని పిలుపు, సుజనా బృందం
కూల్ చేయడానికేనా?:
మార్చి 5నుంచి పార్లమెంటరీ మలి విడుత సమావేశాల నేపథ్యంలో.. శుక్రవారం టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన కాసేపటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పార్లమెంటు సమావేశాల్లో మరోసారి పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు టీడీపీ సిద్దమవుతున్న తరుణంలో.. మిత్రపక్షాన్ని కూల్ చేయడానికే అమిత్ షా ఫోన్ కాల్ చేశారని అంటున్నారు.
గురువారం నాటి భేటీలో అలా..:
ఓవైపు టీడీపీ ఎంపీలతో కఠినంగా వ్యవహరిస్తూనే.. ఇప్పుడు తానే స్వయంగా చర్చలకు రావాలని అమిత్ షా కోరడం వెనుక ఎలాంటి సంకేతాలున్నాయన్న ఆసక్తి నెలకొంది. నిజానికి ఎంపీ రామ్మోహనాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గురువారమే అమిత షాను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రస్తావించగా.. చేయాల్సిందంతా చేశాం.. మీరే నిజాలు దాస్తున్నారు అన్న తరహాలో అమిత్ షా తేల్చేశారట.
ఇప్పుడేమో ఇలా.., మెత్తబడ్డారా?:
గురువారం నాటి భేటీలో అంత కఠినంగా మాట్లాడిన అమిత్ షా.. ఉన్నట్టుండి ఎందుకు మెత్తబడ్డారన్న దానిపై చర్చ జరుగుతోంది. సోమవారం రోజు చర్చలకు రావాలని కోరిన అమిత్ షా.. చంద్రబాబుతో ఐదు నిమిషాల పాటు మాట్లాడారు. అయితే అమిత్ షా.. చర్చల వ్యూహం టీడీపీతో రాజీ కోసమా.. లేక తాడో పేడో తేల్చుకోవడం కోసమేనా? అన్నది కూడా ఉత్కంఠను రేకెత్తిస్తోన్న అంశం.
ఎందుకు రమ్మన్నట్టు?:
మార్చి 5వ తేదీన పార్లమెంట్ మలివిడుత సమావేశాలు మొదలుకానున్నాయి. అదే రోజున అమిత్ షా.. టీడీపీని చర్చలకు ఆహ్వానించారు. కాబట్టి.. ఆరోజు భేటీతో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు మున్ముందు ఎలా ఉండబోతున్నాయన్నది తేలిపోతుంది.
ఇన్నాళ్లు ప్రత్యేక హోదా అంశాన్ని అంతగా పట్టించుకోని టీడీపీ.. ఇప్పుడు మళ్లీ దాన్ని తెర పైకి తీసుకొస్తుండటం కూడా బీజేపీని కలవరపెడుతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హోదా అంశాన్ని టీడీపీ మరోసారి లేవనెత్తకుండా ఉండాలంటే.. ప్యాకేజీ మాటకే కట్టుబడి బీజేపీ ఏపీకి కొత్తగా ఏమైనా చేయాల్సిందే.
లేదంటే టీడీపీ వెనక్కి తగ్గకపోవచ్చు. కాబట్టి అమిత్ షా టీడీపీని చల్లబరుస్తారా? లేక నిజంగానే ఏపీ కోసం ఏమైనా చేస్తారా? అన్నది వేచి చూడాలి.