మీరొద్దు: శివాజీ, పవన్కు తిక్కుంటే మాకు పిచ్చి.. బుల్లెట్ను నమ్ముతావా: అవంతి
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన తిరుపతిలో బహిరంగ సభలో మాట్లాడిన నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు శివాజీ, సిపిఐ నేత నారాయణ, తెలుగుదేశం నేతలు తదితరులు స్పందిస్తున్నారు.
శివాజీ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ హోదా పైన గొంతెత్తినందున పార్టీ అధిష్ఠానం వద్ద మంచి మార్కులు కొట్టేయవచ్చునని, అతనిని విమర్శించేందుకు పోలమంటూ రాజకీయ నాయకులు ముందుకు రావొద్దని సూచించారు. పవన్ రంగంలోకి దిగడంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చితీరుతుందన్నారు.
మోడీ భజన కాదు, చంద్రబాబుని ఇబ్బంది పెడతా: పంచ్ డైలాగులతో పవన్
పవన్ రాజకీయాల్లోకి వస్తే తాము బిచాణా ఎత్తేయాలన్న సంగతి చాలా మందికి తెలుసన్నారు. అందుకే ఆయనను విమర్శించేందుకు పలువురు ముందుకు వస్తారని, అలాంటి వారంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీకి హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించగల సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. విమర్శలు మాని ఆయన చేస్తానన్న పనిని అభినందించాలన్నారు. ఏపీకి హోదా ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
స్వాగతిస్తున్న టిడిపి
ప్రత్యేక హోదా సాధనకు పవన్ తలపెట్టిన పోరాటం మంచిదేనని టిడిపి అభిప్రాయపడుతోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచుతూ ఇప్పటికే తాము చేస్తున్న పోరాటానికి పవన పోరాటం ఉపయోగపడుతుందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తిరుపతి సభలో పవన్ ప్రసంగం అనంతరం టిడిపి నేతలు ఆయన ప్రసంగాన్ని విశ్లేషిస్తున్నారు.
ప్రత్యేక హోదా కావాలని టిడిపి బలంగా కోరుకొంటోందని, రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందని, ఆ నష్టం నుంచి కోలుకోవాలంటే హోదా ఇవ్వాల్సిందేనని సీఎం చంద్రబాబు పదేపదే కేంద్రాన్ని కోరుతున్నారని, అనేక మార్గాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.
హోదా కోసం ఎవరు పోరాడినా వారికి మద్దతు ఇవ్వాలని టిడిపి గతంలోనే నిర్ణయం తీసుకొంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో పెట్టిన బిల్లు ఓటింగ్కు వస్తే దానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోరాడినా స్వాగతిస్తామని, ఆయన కృషికి తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారు. హోదాపై పోరులో పవన్ కలిసివస్తే కలుపుకొని పోయి ఉమ్మడి పోరాటం చేయాలన్న ఆలోచన కూడా కొందరు టిడిపి నేతల్లో ఉంది.
తిరుపతిలో నాడు చిరు, నేడు పవన్: ఒక్క రోజు తేడా అంతే
చంద్రబాబుపై విమర్శలు మాత్రం..
టిడిపి పైన పవన్ చేసిన విమర్శలు సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా చేయాలని పవన్ కోరారని, అశోక్, సుజనా చౌదరి పదవులకు రాజీనామా చేస్తామని ఎప్పుడో ముందుకు వచ్చారని, ఇది తగిన సమయం కాదని పార్టీ వారిని ఆపిందని, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయిస్తామని చెబుతున్నారు.
హోదా కోసం టిడిపి పోరాడటం లేదని, భయపడుతోందని పవనే్ చేసిన విమర్శలో కూడా వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా టిడిపి ఎంపీలు పార్లమెంటులో ధర్నా చేశారని, హోదా కోరుతూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన ప్రసంగం విని రాజ్యసభ చైర్మన్ స్థానంలో ఉన్న కురియన్ ఆశ్చర్యపోయారని గుర్తు చేస్తున్నారు.
లోకసభలో టిడిపి ఎంపీలు పోరాడిన తర్వాతే కేంద్రం దిగి వచ్చి ఆర్థిక మంత్రితో ఏపీపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని పార్లమెంటులో ప్రకటన చేయించిందని, చంద్రబాబు ప్రతిపక్షంలో పదేళ్లు ఉన్నప్పుడే ఎవరికీ భయపడలేదని, అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు భయపడతారని టిడిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తమ కేంద్రమంత్రులు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని, టిడిపి పైన పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ పొంగే పాలల్లో ఉప్పుగళ్లు వేసే వ్యక్తి అని సీపీఐ నేత నారాయణ అన్నారు. కడప జిల్లాలోని రాజంపేటలో ఆయన మాట్లాడుతూ.. చేతనైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, లేని పక్షంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్లా ఇంట్లో ఉండాలని పవన్కు సూచించారు. తన స్వార్ధం కోసం పవన్ అభిమానులను వినియోగించుకుంటున్నారన్నారు.
మాకు పిచ్చి ఉంది: అవంతి శ్రీనివాస్ ఆగ్రహం
పవన్ కళ్యాణకు తిక్క ఉంటే తనకు పిచ్చి ఉందని అనకాపల్లి టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆదివారం అన్నారు. పవన్ నీతులు వల్లించడం మాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల తరపున పోరాడాలన్నారు. "సార్ ..సార్' అంటున్నామని పవన్ అంటున్నారని, ప్రధాన మంత్రి గారిని సారే్ అనకుండా ఏమనాలని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఇప్పటివరకు 23 సార్లు ఢిల్లీకి వెళ్లారన్నారు. పవన్ ప్రత్యేక హోదా పైన కార్యాచరణ ప్రకటిస్తే తాము కలిసేందుకు సిద్ధమని చెప్పారు. పదవులు గడ్డిపోచతో సమానం అన్నారు. పవన్కు ఎంత పోరాటపటిమ ఉందో అంతకుమించి మాకు ఉందన్నారు. పవన్ బుల్లెట్ను నమ్ముతారా, బ్యాలెట్ను నమ్ముతారా చెప్పాలన్నారు. అనకాపల్లి నుంచి పవన్ పోటీ చేస్తానంటే నేను రాజీనామాకు సిద్ధమన్నారు.
ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ మాట్లాడటం సంతోషకరమని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. పవన్ యాక్షన్ ప్లాన్తో వచ్చారన్నారు. హోదా కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు. పవన్ సభ వెనుక టిడిపి ఉన్నదని చెప్పడం సరికాదన్నారు.