భార్య పట్ల ఓ టెక్కీ దారుణం: ఏమాత్రం కనికరం లేకుండా ఆమెను..
ఆమెను ఇంటి బయట అలాగే వదిలేసి.. ఇంటికి తాళం వేసుకుని బ్రహ్మేశ్వరరావు ఎక్కడికో వెళ్లిపోయాడు.
హైదరాబాద్: ప్రేమగా చూసుకోవాల్సిన భర్తే ఆమె పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. పెళ్లయిన నాటి నుంచే ఆమెకు నరకం చూపిస్తూ.. చిత్రహింసలు పాలుచేస్తున్నాడు. తాజాగా మరోసారి ఆమెను తీవ్రంగా కొట్టిన సదరు భర్త.. అపస్మారక స్థితిలో ఆమెను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన కొండపల్లి పుష్పశ్రీకి, బ్రహ్మేశ్వరరావులకు 5ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బ్రహ్మేశ్వరరావు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
భార్యతో కలిసి మియాపూర్లోని ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్నాడు. వీరికి ఇంకా పిల్లలు కలగలేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొన్నిరోజులుగా భార్యను బ్రహ్మేశ్వరరావు తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లోనే ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు.
అతను కొట్టిన దెబ్బలకు పుష్పశ్రీ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయినా కనికరం లేకుండా.. ఆమెను ఇంటి బయట పడేసి.. ఫ్లాట్ కు తాళం వేసుకుని బ్రహ్మేశ్వర రావు ఎక్కడికో వెళ్లిపోయాడు. పుష్పశ్రీ పరిస్థితి గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పుష్పశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు బ్రహ్మేశ్వరరావుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.