సీఎం జగన్ చూపు వ్యవసాయం వైపు.. అధికారులకు దిశానిర్దేశం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపరంగా తనదైన స్టైల్లో దూసుకెళుతున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని ఔరా అనిపిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా ఆయన వ్యవసాయం వైపు దృష్టి మళ్లించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కలెక్టర్ల సదస్సులో భాగంగా విత్తనాల కొరత గురించి పలువురు మంత్రులు జగన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించారు.
ఏపీలో విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికార యంత్రాగానికి ఆదేశాలు జారీ చేశారు జగన్. వ్యవసాయానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఖరీఫ్ సాగులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అగ్రికల్చర్ విషయంలో ఆయా నిధుల విడుదలకు సంబంధించి కాసింత ఉదారంగా వ్యవహరించాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు.

వ్యవసాయ శాఖ అధికారులకు కూడా జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రత్యామ్నాయ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అయితే జాతీయ విత్తన కార్పొరేషన్ ద్వారా సమస్యను అధిగమిస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సీఎంకు చెప్పారు. రానున్న ఐదేళ్లకు సరిపడా విత్తనాలపై సరైన ప్రణాళిక రూపొందించాలని జగన్ సూచించారు. వచ్చే ఏడాది అవసరమైన విత్తనాల కంటే 10 శాతం అదనంగా సేకరించాలన్నారు.
విత్తనాల కొరతకు గత ప్రభుత్వంలో జరిగిన సమన్వయలోపమే కారణమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మిర్చి విత్తనాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు సీఎంకు వివరించారు. దానిపై జగన్ స్పందిస్తూ ఎమ్మార్పీ నిర్ణయిద్దామని తెలిపారు. విత్తనాల నాణ్యతకు పరిశోధనా సంస్థల స్థాపన లేదంటే నేరుగా ఇతర సంస్థలతో ఎంవోయూలు చేసుకునే పద్ధతులను పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications