పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో (El Nino) కారణంగా ఇప్పటికే భారత్ లో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు విస్తరించి దేశమంతా వర్షాలు కురవాల్సిన పరిస్ధితి నుంచి వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూసే పరిస్ధితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. జూన్, జూలైలో కురవాల్సిన వర్షం కంటే చాలా చోట్ల తక్కువగా కురిసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత వాతావరణ విభాగం (IMD) చావు కబురు చల్లగా చెప్పింది.
AP Weather: ఏపీకి వాయుగండం- రేపు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..!
ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా ఇలాగే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇవాళ ప్రకటించింది. జూలైలో కాస్త పరిస్ధితులు మెరుగుపడుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఐఎండీ చేసిన ప్రకటన రైతులతో పాటు సాధారణ ప్రజల గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంపై ఓ మోస్తరు ఎల్ నినో కొనసాగుతున్నందున నైరుతి రుతుపవనాలు బలహీనపడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
ఇవాళ ఐఎండీ విడుదల చేసిన నెలవారీ అప్డేట్ లో ఆగస్టు నెలలో భారతదేశంలో సగటు వర్షపాతం దీర్ఘకాల సగటులో 94% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అయినా వాయువ్య, ఈశాన్య, తూర్పు-మధ్య, తూర్పు ద్వీపకల్ప ప్రాంతంలోని కొన్ని భాగాలలో సాధారణం నుండి అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవన కాలం రెండవ భాగంగా భావించే ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కలిపినా వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఎల్ నినో ఆగస్టు నెల మొత్తం మధ్యస్థ తీవ్రతతో కొనసాగి, సెప్టెంబరులో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.Monsoon Cloud: వర్షాన్ని మోసుకొస్తున్న భారీ మేఘం-ఏకంగా 10 వేల కిలోమీటర్ల పొడవు..!