షాకింగ్: ఫేక్ రెండెసివిర్.. వయల్స్‌లో సెలైన్ నింపి.. మనుషులు చస్తున్నారన్న కనికరం కూడా లేకుండా...


ఓవైపు కరోనాతో జనం బెంబేలెత్తిపోతుంటే... మరోవైపు ఇదే అదనుగా కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయి. నిన్నటికి నిన్న వాడి పడేసిన మాస్కులను పరుపుల తయారీకి ఉపయోగిస్తున్న ఘటన వెలుగుచూడగా... తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యాంటీ కోవిడ్ వైరల్ డ్రగ్ రెండెసివిర్ పేరుతో నకిలీ రెండెసివిర్‌ను విక్రయిస్తున్న ఓ నర్సు బాగోతం కర్ణాటకలో వెలుగుచూసింది. ఖాళీ అయిన రెండెసివిర్ వయల్స్‌లో సదరు నర్సు సెలైన్ వాటర్,ఇతరత్రా యాంటీ బయాటిక్స్‌ను నింపి విక్రయిస్తుండటం గమనార్హం.

వయల్స్‌లో సెలైన్,యాంటీ బయాటిక్స్ నింపి...

మైసూరు పోలీస్ కమిషనర్ చంద్రగుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం... నగరంలో రెండెసివిర్ డ్రగ్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న సమాచారంతో కొన్ని చోట్ల దాడులు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో గిరీష్ అనే మేల్ నర్సు రెండెసివిర్ పేరుతో నకిలీ డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. వివిధ కంపెనీలకు చెందిన రెండెసివిర్ బాటిల్స్‌ను రీసైక్లింగ్ చేసి... వాటిలో సెలైన్,యాంటీ బయాటిక్స్ నింపి అదే మెడికల్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నట్లు చెప్పారు.

2020 నుంచే దందా...

నిజానికి 2020 నుంచే అతను ఈ దందా నడిపిస్తున్నట్లు గుర్తించామని కమిషనర్ చంద్ర గుప్తా తెలిపారు. మొత్తం 2.82లక్షలు విలువ చేసే 41 నకిలీ రెండెసివిర్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హెల్త్ కేర్ రంగంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి ద్వారా గిరీష్ రెండెసివిర్ ఖాళీ వయల్స్‌ను తెప్పించుకున్నట్లు గుర్తించామన్నారు. గిరీష్‌కు పరిచయం ఉన్న మంజునాథ్,ప్రశాంత్ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఆ నకిలీ రెండెసివిర్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు,బ్లాక్ మార్కెట్‌లోనూ గిరీష్ రెండెసివిర్ డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఇప్పటివరకూ 900 వయల్స్ సేల్...

సోమవారం(ఏప్రిల్ 19) నాటికి 900 నకిలీ రెండెసివిర్ వయల్స్‌ను గిరీష్ విక్రయించినట్లు మరో పోలీస్ అధికారి వెల్లడించారు. రెండెసివిర్ ఖాళీ వయల్స్‌‌ను తీసుకురావడంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న మంగళ అనే హౌస్ కీపింగ్ సిబ్బంది,మరో ఆస్పత్రిలో పనిచేస్తున్న శివప్ప అనే సెక్యూరిటీ గార్డు సహకరించినట్లుగా గుర్తించామన్నారు. ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు... అన్న దానిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. గిరీష్‌తో ఇందులో ప్రమేయం ఉన్న మరికొందరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. గిరీష్ ప్రస్తుతం మైసూరులోని జేఎస్ఎస్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
మనుషులు చస్తున్నారన్న కనికరం లేకుండా...

ఈ ఘటనపై మైసూరులోని నజర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 276,సెక్షన్ 420,సెక్షన్ 34ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. అంతకుముందు,ఆదివారం(ఏప్రిల్ 19) రెండెసివిర్ డ్రగ్‌ను బ్లాక్ మార్కెట్‌లో రూ.10,500కి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు కరోనా కేసులు పెరిగి హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమవుతున్న తరుణంలో రెండెసివిర్ వైరల్ డ్రగ్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇదే అదనుగా కొంతమంది దుర్మార్గులు ఇలా నకిలీ రెండెసివిర్‌లను విక్రయించడంతో పాటు బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు డ్రగ్‌ను విక్రయిస్తున్నారు. ఓవైపు మనుషులు చనిపోతున్నారన్న కనీస కనికరం కూడా లేకుండా... ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Read more...

English Summary

A staff nurse working at a private hospital in Karnataka’s Mysuru was arrested on Monday for allegedly refilling cheap antibiotic medicines or saline solution in empty vials of Remdesivir for sale to needy patients.