రేపటిలోగా డీల్ కుదరకపోతే ఇరాన్ పై బాంబుల వర్షం: ట్రంప్ సంచలనం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్- అమెరికా మధ్య ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దాంతో ఇరు దేశాల మధ్య ఏప్రిల్ 21 న రెండో దఫా శాంతి చర్చలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి లోగా ఇరాన్ డీల్ కు ఒప్పుకోకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ తో యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. అటు ఇరాన్ మాత్రం చర్చలకు ఏమాత్రం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దాంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే.
శాంతి చర్చల విషయంలో ఇరాన్, అమెరికా మొండి పట్టు పడుతున్నాయి. మెదటి దఫా శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఏప్రిల్ 21 మంగళవారం నుంచి రెండో దఫా శాంతి చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ప్రారంభం కావాల్సి ఉంది. శాంతి చర్చలకు అమెరికా, ఇరాన్ ఒప్పుకున్నాయని కొంతమంది అధికారులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. చర్చల సమయం, తేదీని ఇంకా అమెరికా గానీ ఇరాన్ గానీ చెప్పలేదు. అటు తమ దేశానికి ఇరాన్, అమెరికా బృందాలు రాలేదని పాకిస్థాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సెకండ్ రౌండ్ శాంతి చర్చలు జరుగుతాయా..? లేదా..? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటిలోగా ఇరాన్ డీల్ కు ఒప్పుకోకపోతే దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై దాడులకు అమెరికా సైన్యం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని స్పష్టం చేశారు. ఇరాన్ అవలంబిస్తున్న ధోరణితో చర్చలు జరపడం కష్టమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇరాన్ తో యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉందని సీఎన్బీసీ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అమెరికా- ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందం బుధవారం తెల్లవారుజామున ముగియనున్న నేపథ్యంలో ఆ గడువును పొడిగించే ఉద్దేశం తమకు లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.

మరోవైపు ట్రంప్ వార్నింగ్ ను ఇరాన్ ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఇరాన్ సైతం అదే స్థాయిలో అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడులు చేస్తే అమెరికా, ఇజ్రాయెల్ కు నరకాన్ని చూపిస్తాం.. అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. దాంతో ఇరాన్- అమెరికా మధ్య చర్చల కంటే మళ్లీ యుద్ధమే జరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications