Petrol, Diesel: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు అప్పుడే..! తేల్చేసిన కేంద్రం..!
అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని (Petrol, Diesel price) వరుసగా పెంచుకుంటూ పోయిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు యుద్దం ముగిసిపోయి శాంతి ఒప్పందాలు కుదిరిపోయి, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గిపోయినా దేశీయంగా మాత్రం ధరలు తగ్గించడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై స్పందించారు.
అమెరికా-ఇరాన్ వార్ ముగింపుతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే పరిస్ధితి లేదని హర్దీప్ సింగ్ పూరీ తేల్చిచెప్పేశారు. ఇప్పటికే చమురు సంస్థలు 70 వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత ధరలు తగ్గినా, అప్పటికే చమురు సంస్థలు రెండు నెలల క్రితమే కొనుగోలు చేసి పెట్టిన క్రూడాయిల్ ను శుద్ధి చేసి అందిస్తున్నట్లు హర్దీప్ పూరీ తెలిపారు. కాబట్టి గతంలో కొనుగోలు చేసిన క్రూడాయిల్ నిల్వలు ముగిసిన తర్వాత పరిస్ధితి క్రమంగా అదుపులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

అంటే అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి రెండు నెలలకు ముందు చమురు సంస్థలు కొనుగోలు చేసిన క్రూడాయిల్ స్టాక్ పూర్తయి, ఆ తర్వాత తగ్గిన ధరల ప్రకారం కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్ శుద్ధి చేయాల్సి ఉంటుంది. అప్పుడు చమురు సంస్థల నష్టాలు క్రమంగా తగ్గుతాయి. ఇవి పూర్తిగా తగ్గి చమురు సంస్థలు లాభాల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరీ చెప్పకనే చెప్పేశారు. దీంతో వచ్చే నాలుగైదు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదని తేలిపోయింది.














Click it and Unblock the Notifications