దిగొచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా! నాల్సార్ వర్సిటీలో ఊహించని ట్విస్ట్..
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక న్యాయ కళాశాల అయిన హైదరాబాద్ 'నాల్సార్' (NALSAR) విశ్వవిద్యాలయం చుట్టూ తిరుగుతున్న రాజకీయ, న్యాయపోరాటం అనూహ్య మలుపులు తిరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ను కాన్వొకేషన్కు ముఖ్య అతిథిగా పిలవడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర దుమారం రేపింది.
ఈ వ్యవహారంలో అత్యంత ఘాటుగా స్పందించిన భారత బార్ కౌన్సిల్ (BCI), నాల్సార్ 2026 బ్యాచ్కి చెందిన లా విద్యార్థులెవ్వరినీ అడ్వకేట్లుగా నమోదు చేయకూడదని రాష్ట్ర బార్ కౌన్సిల్స్కు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయంపై నలుమూలల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవ్వడం, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో బీసీఐ కొద్ది గంటల్లోనే తన ఆదేశాలను సవరించుకుని నిషేధాన్ని ఉపసంహరించుకుంది.
After detailed deliberation, the @barcouncilindia has modified its earlier directions concerning @NALSAR_Official.
— Manan Kumar Mishra (@MishraManan01) August 13, 2026
All 2026 passed-out students of NALSAR will now be entitled to seek enrolment with the State Bar Council of their choice. The factual inquiry will continue, and… pic.twitter.com/uJPkpHaOXj
విద్యార్థులపై కక్షసాధింపు తగదు: బీసీఐ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా లాయర్లు, ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన నిరసనల అనంతరం బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. నాల్సార్ 2026 బ్యాచ్లోని అర్హులైన విద్యార్థులందరూ ఎప్పటిలాగే తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్లుగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. "ఏ ఒక్క విద్యార్థి తప్పు లేకుండా శిక్షను అనుభవించకూడదనే ఉద్దేశంతోనే మునుపటి ఆదేశాలను సవరించాం. అయితే, ఈ వివాదంపై అసలు నిజాలను తేల్చేందుకు విచారణ కొనసాగుతుంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి" అని ఆయన వెల్లడించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించని వారు భవిష్యత్తులో మంచి న్యాయవాదులుగా లేదా న్యాయమూర్తులుగా రాణించలేరని, ఇది వృత్తిపరమైన క్రమశిక్షణకు విరుద్ధమని బీసీఐ అభిప్రాయపడింది.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' నిర్వహించిన 'చలో సంసద్' నిరసనల సందర్భంగా పోలీసుల లాఠీచార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగంపై వివాదం చెలరేగింది. నీట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుకు నిరసనగా జరిగిన ఈ ప్రదర్శనపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ జులై 22న సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ కోరారు. ఆ సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం "మా సమయాన్ని, మీ సమయాన్ని వృథా చేయకండి.. మేము ఎలాంటి వీడియోలు చూడము" అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ నాల్సార్ వర్సిటీ కాన్వొకేషన్కు సీజేఐని ఆహ్వానించవద్దని కోరుతూ కొంతమంది విద్యార్థులు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు వినతిపత్రం ఇచ్చారు. ఇదే వివాదానికి మూలకారంగా మారింది.
వర్సిటీ టీచర్ల హస్తం ఉందా?
ఈ నిరసన వెనుక వర్సిటీలోని కొందరు ప్రొఫెసర్లు, స్టాఫ్ మెంబర్ల ప్రోద్బలం ఉందనే అనుమానాన్ని బీసీఐ వ్యక్తం చేసింది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను కావాలనే తప్పుడు తోవలో నడిపిస్తూ, అంతర్గత రాజకీయాలు నడుపుతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని బీసీఐ ఆరోపించింది. ఈ నిరసన కార్యక్రమానికి ఎవరు నాయకత్వం వహించారు? ఎవరు ప్రణాళికలు రచించారు? సంతకాలు చేసిన విద్యార్థుల జాబితాతో కూడిన పూర్తి ఆధారాలతో కూడిన నివేదికను 3 రోజుల్లో తమకు సమర్పించాలని నాల్సార్ యాజమాన్యాన్ని బీసీఐ ఆదేశించింది.
రాజకీయ రంగు పులుముకున్న అంశం
బీసీఐ తీసుకున్న తొలి నిషేధం నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీసీఐ అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా అధికార పక్షానికి చెందిన ఎంపీ కావడాన్ని ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాసేలా విద్యార్థులపై కక్షసాధింపు చర్యలకు దిగడం చట్టవిరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ ధ్వజమెత్తారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు కూడా బీసీఐ కార్యాలయం , అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బార్ కౌన్సిల్ నిషేధాన్ని ఎత్తివేయడం విద్యార్థులకు, న్యాయ వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది.














Click it and Unblock the Notifications